స్త్రీని రేప్ చేసి యమునలో పడేశారు: మిత్రుడ్నీ చంపారు
డెహ్రాడూన్: మగమృగాలు అత్యంత నీచమైన కార్యానికి ఒడిగాట్టారు. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమెను చంపేశారు. ఆమె మిత్రుడిని కూడా హత్య చేశారు. డూన్ల అందాలను చూడడానికి, అక్కడే దీపావళి జరుపుకోవాలని మిత్రుడితో కలిసి వచ్చిన మహిళ బతుకు అక్కడే అంతమైంద. తనతో పాటు వచ్చిన మిత్రుడినీ బలి కోరింది.
ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మహిళను ట్యాక్సీ డ్రైవర్ రాజు, అతడి సహచరులు బబ్లూ, గుడ్డు, కుందన్ అనే దుర్మార్గులు మూకుమ్మడిగా మీదపడి అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను యమునా నదిలో తోసేసి వెళ్లిపోయారు. ఆమె మిత్రుడు 24 ఏళ్ల అవిజిత్ పాల్నూ చంపేసి ఎక్కడో కొండల్లో పారేశారు.
అక్టోబర్ 23న జరిగిన ఈ దారుణ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిద్దరు దీపావళి జరుపుకోవాలని అక్టోబర్ 21న డెహ్రాడూన్ వచ్చారు. అక్టోబర్ 23న టైగర్ ఫాల్స్ నుంచి తన క్యాబ్లో బయలుదేరిన వారిని తామే చంపేసినట్లు, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆ దుండగులు నేరాన్ని అంగీకరించారు.
అక్టోబర్ 21వ తేదీ డెహ్రాడూన్ వచ్చిన యువతి, ఆమె మిత్రుడు రెండు రోజుల తర్వాత కనిపించకుండా పోయినట్లు పోలీసులు చెప్పారు. మహిళ, ఆమె మిత్రుడు అక్టోబర్ 23వ తేదీన చక్రాతాకు 30 కిలోమీటర్ల దూరంలో గల టైగర్ ఫాల్స్ నుంచి టాక్సీలో తిరిగి వస్తుండగా ఆ దారుణం జరిగింది. మహిళ మిత్రుడు మృతదేహం ఉత్తరకాశి జిల్లాలోని పురోలాలో కనిపించి, అతన్ని గుర్తించిన తర్వాత సంఘటన వెలుగులోకి వచ్చంది.
మహిళను లఖమండల్ వద్ద యమునా నదిలోకి తోసేశారు. వారి గురించి సమాచారం తెలియకపోవడంతో మహిళ తండ్రి అక్టోబర్ 29వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యమున నదిలో మహిళ శవం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ గుర్గావ్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు కాగా, ఆమె మిత్రుడు కోల్కతాలో చిత్రకారుడు. మహిళ శవాన్ని యమునలోకి పడేసిన తర్వాత ఆమె మిత్రుడి శవాన్ని కూడా పడేయాలని అనుకున్నారు. కానీ, అటు వైపుగా వాహనం రావడంతో హడావిడిగా అతని శవాన్ని లోయలోకి తోసేశారు.