ఎమ్మెల్సీ ఎన్నికలు: జమ్మలమడుగు బూత్ వద్ద సీఎం రమేష్ హల్చల్
ఓటు హక్కు లేని నేతలను లోపలికి అనుమతించవద్దన నిబంధన ఉన్నప్పటికీ.. సీఎం రమేష్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
కడప: జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్ష వైసీపీ సభ్యులు అగ్రహంతో ఉన్నారు. ఈ ఉదయం ప్రారంభమైన పోలింగ్ లో అధికార పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ వారు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు జమ్మలమడుగు పోలింగ్ బూత్ వద్ద టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కొద్దిసేపు హల్ చల్ చేశారు. ఓటు హక్కు లేని నేతలను లోపలికి అనుమతించవద్దన్న నిబంధన ఉన్నప్పటికీ.. సీఎం రమేష్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకోవడంతో వెనక్కి వెళ్లక తప్పలేదు. రాజంపేటలో మాత్రం టీడీపీ నేతలను పోలింగ్ బూత్ లోపలికి పోలీసులు అనుమతించినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు లేకపోయినా వారిని లోపలికి అనుమతించడం పట్ల వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు వారి వాదనను పట్టించుకోలేదు. అధికార పార్టీ దౌర్జన్యంతో, ప్రలోభాలతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఓవైపు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్నా.. వాటిని గాలికొదిలేసి పలువురు మంత్రులు, టీడీపీ నాయకులు గత వారం రోజుల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల పనిలో మునిగిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది.
కాగా, కడపలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి బరిలో ఉండగా.. టీడీపీ నుంచి బీటెక్ రవి బరిలో ఉన్నారు. స్థానికంగా బలం లేకపోయినప్పటికీ.. అధికార దుర్వినియోగంతో టీడీపీ గెలిచేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications