బిజెపితో టిడిపి పొత్తు: సీట్ల సంఖ్య కూడా ఖరారు
హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపిల మధ్య రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లోనూ పొత్తు కుదిరింది. ఇరు పార్టీలు పోటీ చేసే సీట్లపై కూడా అవగాహన కుదిరింది. పొత్తు విషయంపై వచ్చేవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. కుదిరిన ఒప్పందం ప్రకారం బిజెపి తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో 8 స్థానాలకు పోటీ చేస్తుంది. సీమాంధ్రలోని 25 స్థానాల్లో 4 నుంచి 5 ఐదు సీట్లకు పోటీ చేస్తుంది. మిగతా స్థానాల నుంతి టిడిపి పోటీ చేస్తుంది.
శాసనసభ ఎన్నికల్లో కూడా బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహన కుదిరింది. సీమాంధ్రలోని 175 స్థానాల్లో బిజెపి 15 స్థానాల్లో పోటీ చేస్తుంది. తెలంగాణలోని 119 స్థానాల్లో 25 స్థానాలకు బిజెపి పోటీ చేస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ బిజెపి ఉపయోగపడే అవకాశాలున్నాయని భావిస్తున్న తరుణంలో ఆ పార్టీకి ఈ ప్రాంతంలో తెలుగుదేశం ఎక్కువ స్థానాలు ఇవ్వడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది.

ఢిల్లీలో చక్రం తిప్పడానికి వీలుగా తనకు ఎన్డిఎ కన్వీనర్ పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై బిజెపి నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చంద్రబాబు సమక్షంలో బిజెపి జాతీయ నేతలు పొత్తుపై వచ్చే వారం ప్రకటన చేస్తారు.
పొత్తు విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నెలాఖరులో సీమాంధ్రలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాటు అవుతుంది. ఈ వేదికను మోడీతో పాటు చంద్రబాబు పంచుకుంటారు. మోడీ ఫర్ పిఎం, నాయుడు ఫర్ సిఎం నినాదానికి ఆ బహిరంగ సభ శ్రీకారం చుడుతుంది.












Click it and Unblock the Notifications