పెద్ద నోట్ల రద్దు వెనక ఉంది అతనే: మోడీ ఇంట్లో రహస్యంగా కసరత్తు
రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8వ తేదీన మోడీ ప్రకటించగానే దేశప్రజలంతా అవాక్కయ్యారు. అకస్మాత్తుగా ఆయన చేసిన ప్రకటనగా భావించారు. కానీ దాని వెనక పెద్ద కసరత్తే రహస్యంగా జరిగినట్లు చ
న్యూఢిల్లీ: ఐదు వందలు, వేయి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ నవంబర్ 8వ తేదీన ప్రకటించగానే దేశప్రజలంతా అవాక్కయ్యారు. ఆయన అకస్మాత్తుగా ఆ ప్రకటన చేశారని భావించారు. కానీ, దానికి తెర వెనక పెద్ద కసరత్తే జరిగినట్లు చెబుతున్నారు. మోడీ నివాసంలో అందుకు సంబంధించిన కసరత్తు చాలా రహస్యంగా జరిగినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి.
నోట్ల రద్దుకు దాదాపు పది నెలల కసరత్తు చేసినట్లు మోడీనే స్వయంగా చెప్పారు. కనీసం కేబినెట్లోని మంత్రులకు కూడా తెలియకుండా ఆ కసరత్తు రహస్యంగా జరిగినట్లు భావిస్తున్నారు. చివరి నిమిషం వరకు అత్యంత రహస్యాన్ని పాటించారు. తన నిర్ణయాన్ని ప్రకటించడానికి కొద్ది సేపు ముందట కేబినెట్ సమావేశంలో మోడీ ఈ విషయాన్ని మంత్రులకు చెప్పారని సమాచారం. దాంతో ఆశ్చర్యపోవడం వారు వంతైంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆరుగురు వ్యక్తులు ఈ సీక్రెట్ ఆపరేషన్ చేశారు. అదంతా ప్రధాని నివాసం నుంచే జరిగింది. తన నమ్మిన బంటుకు ఆ పనిని మోడీ అప్పగించారు. ఆ వ్యక్తి పేరు హష్ముఖ్ అధియా. 2015 సెప్టెంబర్ నుంచి ఈయన రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పేరుకే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రిపోర్ట్ చేస్తారని, ఆయనకు ప్రధాని మోడీతో నేరుగా సంబంధాలు ఉన్నాయని సమాచారం.

మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..
నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003-06 మధ్యకాలంలో హష్ముఖ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచే మోడీకి ఆయన నమ్మినబంటుగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఆయనను రెవెన్యూ కార్యదర్శిగా నియమించారు. ఇప్పటికీ ఏదైనా కీలక అంశంపై చర్చించాలంటే ఈ ఇద్దరూ గుజరాతీలోనే మాట్లాడుకుంటారు. దీంతో నోట్ల రద్దులాంటి బృహత్తర కార్యక్రమాన్ని కూడా ఆయనకు అప్పగించారు. ఆయనతో పాటు మరో ఐదుగురు అధికారులు ప్రధాని మోడీ ఇంట్లోని రెండు గదుల్లో దీనిపై కసరత్తులు జరిపారు. వీరికి నమ్మకస్తులైన ఓ యువ పరిశోధకులు సాయపడ్డారు.

పది నెలల పాటు కసరత్తు...
పది నెలలపాటు అత్యంత రహస్యంగా వారు నోట్ల రద్దు అమలు, దానివల్ల కలిగే పరిణామాలపై కసరత్తు చేశారు. అందుకే నిర్ణయం ప్రకటించే ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. దీనిపై పూర్తి పరిశోధన నిర్వహించాను. ఇది విఫలమైతే అప్పుడు తనను నిందించాలని అని తన మంత్రివర్గ సభ్యులతో అన్నారు. మోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించగానే.. నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద, ఎంతో సాహసోపేత నిర్ణయం ఇది అని హష్ముఖ్ అధియా ఓ ట్వీట్ చేశారు.

పలువురితో మోడీ చర్చలు...
నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంకులోని సీనియర్ అధికారులు, ఇతర మేధావులతో ఏడాదికిపైగానే మోడీ చర్చలు జరిపినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే ముందు.. కొత్త నోట్లను ఎంత త్వరగా ముద్రించగలం, వాటిని దేశవ్యాప్తంగా ఎలా పంపిణీ చేయాలి, భారీగా వచ్చే డిపాజిట్ల వల్ల స్టేట్ బ్యాంక్స్కు ఏమైనా లాభం ఉందా, నోట్ల రద్దు వల్ల ఎవరికి లాభం అనే ప్రశ్నలు మోడీ వారికి వేసినట్లు తెలుస్తోంది.

మొత్తం సమాచారాన్ని తీసుకుని...
మొత్తం సమాచారాన్ని తీసుకున్న తర్వాత అధియా నేతృత్వంలోని బృందం అత్యంత రహస్యంగా నోట్ల రద్దుపై సైద్ధాంతిక కసరత్తు జరిపారు. డేటా, ఆర్థిక విశ్లేషణల్లో నిపుణులైన యువ బృందం ఈ కసరత్తులో పాలుపంచుకుంది. ఇందులో కొందరు మోడీ సోషల్ మీడియా ఖాతాలను నడిపేవాళ్లు కాగా, మరికొంత మంది ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకునే మోడీ యాప్ను నిర్వహించేవాళ్లు. ఈ కసరత్తును అత్యంత రహస్యంగా చేసినా.. కొన్ని లీకులు మాత్రం బయటకు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని నిపుణులు పెద్ద నోట్ల రద్దు జరగవచ్చుననే అంచనా వేశారు. అటు రిజర్వ్ బ్యాంకు కూడా తాము కొత్త నోట్లను ముద్రిస్తున్నట్లు మేలోనే చెప్పింది. ఆగస్ట్లో 2000 నోట్లను ముద్రిస్తున్నట్లు సమాచారమిచ్చింది.












Click it and Unblock the Notifications