బందరు టెక్కీ హత్య: కిలోమీటర్ దూరంలో చెప్పులు
ముంబై/ హైదరాబాద్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో హత్యకు గురైన అనూహ్యకు చెందిన చెప్పులు, బ్లాంకెట్ ఆమె శవం పడి వున్న స్థలానికి కిలోమీటర్ దూరంలో కనిపించాయి. కేసు విషయంపై ఆంధ్రప్రదేశ్ డిజిపి ప్రసాద రావు ముంబై పోలీసులతో మాట్లాడారు. దీంతో కేసు దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. అనూహ్య మృతదేహం పడి స్థలంలో ఆధారాల కోసం పోలీసులు గాలించారు.
అనూహ్య శవం పడి ఉన్న స్థలానికి కిలోమీటర్ దూరంలో అనూహ్యకు చెందిన బ్లాంకెట్, చెప్పులు కనిపించినట్లు చెబుతున్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి (బందరుకు) చెందిన అనూహ్య ఈ నెల 4వ తేదీన లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్లో బయలుదేరింది. ఆ తర్వాత 16వ తేదీన ముంబైలోని కంజూర్ మార్గ్ - భాండుప్ మధ్యలో తూర్పు ఎక్స్ప్రెస్ హైవేపై సగం కాలిన ఆమె శవం కనిపించింది.
ఇదిలావుంటే, ముంబైలో హత్యకు గురైన అనూహ్య కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓయూ జేఏసీ నేత క్రిశాంక్ ఆరోపించారు. ఆమె మృతి పట్ల సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్బంగా క్రిశాంక్ మాట్లాడారు. నిర్భయ చట్టం వచ్చినా దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు ఆగడం లేదని అన్నారు. అనూహ్య విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. నిర్భయ చట్టాన్ని నేటి పాలకులు ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారే తప్ప మహిళలకు రక్షణ కల్పించే విధంగా లేదని విమర్శించారు.
క్రిస్టియన్ సంస్థల ఆధ్వర్యంలో...
అనూహ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వందలాది మంది క్రిస్టియన్ సోదరులు, హైదరాబాద్ నగరవాసులు సికింద్రాబాద్ క్లాక్టవర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అనూహ్య సోదరుడు మారడోన, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ క్రిస్టియన్, హైదరాబాద్ క్రిస్టియన్ సంస్థలకు చెందిన కెనడీ వాన్ కిమ్ని, ఫ్రాన్సిస్, విల్సన్, రాం తదితరులు పాల్గొన్నారు.