అసలేమైంది?: రూ. 11లక్షలు మోసపోయి టెక్కీ భార్య ఆత్మహత్య
బెంగళూరు: మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. లాటరీలో రూ. 45లక్షలు గెల్చుకున్నారని, రూ. 11లక్షలు చెల్లిస్తే ఈ మొత్తం మీదే అవుతుందని చెప్పగానే నమ్మి.. ఆ మొత్తాన్ని చెల్లించింది. ఈ విషయాన్ని భర్తకు, పిల్లలకు కూడా చెప్పలేదు. ఆ తర్వాత ఇదంతా మోసమని తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని స్వామి వివేకానంద రోడ్ సమీపంలో మృతురాలు వి. పాలక్ తన భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె భర్త ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. కాగా, ఆండ్రూ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. 'మీరు రూ. 45లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నారు. ఈ మొత్తం పొందాలంటే.. న్యాయపరమైన, కస్టమ్స్ పరమైన సమస్యలను తప్పించుకోవడానికి కొంత మొత్తం చెల్లించాలి ' చెప్పాడు.
అతని మాటలను నమ్మిన పాలక్.. ఇంట్లోని కుటుంబసభ్యులకు ఎవరికీ చెప్పకుండానే జూన్ 6 నుంచి 13తేదీల్లో భారీ మొత్తంలో నగదును వారు చెప్పిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. రాహుల్, హస్నాథ్, షబ్బీర్, మొదలగు వ్యక్తుల ఖాతాల్లో ఆమె డబ్బును జమ చేసింది. మరోసారి రూ. 2.5లక్షల నగదును జమ చేసింది.
ఆమె డబ్బులు చెల్లిస్తుండటంతో నిందితులు భారీగా సొమ్మును లాగేందుకు ప్రయత్నించారు. డబ్బులు పొందాలంటే ఇవన్నీ ఖర్చులు చెల్లించాలంటూ ఆమె వద్ద నుంచి రూ. 11లక్షల వరకు డబ్బును తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు నిందితులు. దీంతో తన ప్రైజ్ మనీ తెచ్చుకోవడానికి బాధితురాలు ఢిల్లీకి వెళ్లింది. ఇంకా డబ్బు చెల్లిస్తేనే ప్రైజ్ మనీ దక్కుతుందని ఆమెను కలవకుండానే ఫోన్లో చెప్పారు నిందితులు. తన వద్ద డబ్బు లేదని ప్రైజ్ మనీ ఇవ్వాలని బతిమాలింది పాలక్.
కాగా, నిందితులు ప్రైజ్ మనీని ఆమెకు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన పాలక్.. తిరిగి బెంగళూరుకు చేరుకుంది. పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా.. ఆమెను ఆమె పిల్లలు కాపాడారు. అంత కష్టమేమీ వచ్చిందని కుటుంబసభ్యులు నిలదీయగా.. ప్రైజ్ మనీ మోసం గురించి తెలిపింది. ఈ విషయంపై ఆందోళన చెందవద్దని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కుటుంబసభ్యులు ఆమెకు భరోసా ఇచ్చారు.
పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో కుటుంబసభ్యులు ఉండగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాలక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆమె డబ్బులు జమ చేసిన ఖాతాల వివరాలు, ఫోన్ నెంబర్ల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.