టెక్కీలకు శుభవార్త:150 బిలియన్ డాలర్లతో వృద్ది, ఐటీలో సంక్షోభం లేదు, యూనియన్లు ఎందుకు?
ఉద్యోగుల సంక్షేమాన్ని బాగా చూసుకొంటున్నప్పుడు ఐటీ కంపెనీల్లో యూనియన్లు అవసరం లేదని ఇన్పోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్ తేల్చి చెప్పారు.
ముంబై: ఉద్యోగుల సంక్షేమాన్ని బాగా చూసుకొంటున్నప్పుడు ఐటీ కంపెనీల్లో యూనియన్లు అవసరం లేదని ఇన్పోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్ తేల్చి చెప్పారు.సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో యూనియన్లు ఏర్పాటుచేసుకోవాలని సాప్ట్ వేర్ ఉద్యోగులు నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల బాలకృష్ణన్ స్పందించారు.
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పుల కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకొంటున్నాయి.ఇందులో భాగంగానే కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ప్రధానంగా అమెరికాలో చోటుచేసుకొన్న మార్పులు సాఫ్ట్ వేర్ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలపై అమెరికా తీసుకొంటున్న నిర్ణయాల ప్రభావం కన్పిస్తోంది.
మరోవైపు చాలా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు భయంతో కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. మేనేజ్ మెంట్ నుండి ఎప్పుడు పింక్ స్లిప్ లను తీసుకోవాల్సి వస్తోందనే భయం పట్టుకొంది.దీంతో యూనియన్లను ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.
యూనియన్ల ఏర్పాటు అవసరం లేదు
ఉద్యోగుల సంక్షేమాన్ని బాగా చూసుకొంటున్నసమయంలో టెక్కీలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో యూనియన్లను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం లేదని ఇన్పోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఐటీలో భారీగా ఉద్యోగాల కోత ఉంటుందనే వార్తలు అతిశయోక్తి మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.ఉద్యోగులను చెల్లింపుల విషయంలో తాము చాలా నైతికంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారాయన. టెక్కీలు ఉద్యమబాట పట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐటీ లో సంక్షోభం లేదు
ఐటీ లో సంక్షోభం ఉన్నప్పుడు యూనియన్లు పుట్టుకొస్తాయన్నారు. కానీ, తర్వాత అవి ఉనికిలో ఉండవన్నారు. ఈ సంక్షోభసమయంలో కూడ తీసివేతలు రెండంకల్లోనే ఉన్నాయన్నారు.జీతభత్యాలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో అసలు ఉద్యోగసంఘాల అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగుల హక్కుల పట్ల అస్తవ్యస్తంగా , అనైతికంగా వ్యవహరించే కంపెనీలకు తప్ప ఐటీ కంపెనీలకు ఉద్యోగ సంఘాలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
150 బిలియన్ డాలర్లతో ఐటీ పరిశ్రమ వృద్ది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 150 బిలియన్ డాలర్లతో ఐటీ సర్వీసుల పరిశ్రమ ఒకే స్థాయిలో వృద్ది చెందుతున్నట్టు కన్పిస్తోందని వచ్చే ఏడాది రెండింతలు పెరగవచ్చంటూ ఆయన కొత్త ఆశలను రేకెత్తించారు. అంతేకాదు ఐటీలో అవకాశాలు చాలా పెద్దవిగా ఉన్నాయన్నారు. భారత్ కు అతిపెద్ద మార్కెటైన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకటిన్నర నుండి రెండు శాతం వద్ద పెరుగుతోందని బాలకృష్ణన్ తెలిపారు.
ప్రతిభ ఆధారంగానే తొలగింపులు
మిగిలిన వాటి తరహాలో ఐటీ పరిశ్రమ సంప్రదాయ పరిశ్రమ కాదన్నారు బాలకృష్ణన్. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగులపై వేటు ఉంటుందన్నారు. భారీ ఉద్యోగాల నష్టం అనేది అతిశయోక్తి తప్ప మరోటి కాదన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అనేకమందికి ఉపాధిని కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి సంక్షోభసమయంలో రెండంకెల స్థాయిలో కూడ ఉద్యోగులను తొలగించలేదన్నారు.