హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం ముంబైకు మళ్లింపు: సాంకేతిక సమస్య
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం సంభవించింది. ఎల్లో హైడ్రాలిక్ వ్యవస్థ వైఫల్యం కారణంగా 143 మందితో కూడిన ఎయిర్ ఇండియా ఏ320 విమానం (హైదరాబాద్-దుబాయ్) శనివారం ముంబైకి మళ్లించారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని అధికారులు వెల్లడించారు. విమానంలో ఏర్పడిన సమస్యను పరిశీలిస్తున్నారు సంబంధిత సిబ్బంది. కాగా, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సంస్థ తెలిపింది. కాగా, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. కన్నూర్ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా ఈ నెల ప్రారంభంలో ముంబై విమానాశ్రయానికి మళ్లించారు.
జూలై 22న, ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న బోయింగ్ 787 విమానంలో సుమారు 260 మంది వ్యక్తులు దుబాయ్ నుంచి కొచ్చికి ప్రయాణిస్తున్నప్పుడు క్యాబిన్ డిప్రెషరైజేషన్ను ఎదుర్కొంది. దీంతో ఈ విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిచింది. ఫలితంగా ఆక్సిజన్ మాస్క్లు అమర్చగా, కొంతమంది ప్రయాణీకులకు ముక్కు నుంచి రక్తం కారిందని అధికారులు తెలిపారు.
డీజీసీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 17న ఇండిగో షార్జా-హైదరాబాద్ విమానాన్ని పైలట్లు ముందుజాగ్రత్తగా కరాచీకి మళ్లించారు.
విమానం ఇంజిన్లలో సెకను పాటు వైబ్రేషన్లు కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఇండిగోకు చెందిన ఢిల్లీ-వడోదర విమానాన్ని జూలై 14న జైపూర్కు మళ్లించారు.