చెట్టుకు వేలాడుతూ అమ్మాయి శవం: గ్యాంగ్ రేప్, హత్య?
ముంబై: మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లాలో ఓ టీనేజ్ అమ్మాయి శవం అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. గత నెల జరిగిన ఈ సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కూతురిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తల్లిదండ్రులతో పాటు ఇటుక బట్టీల్లో 16 ఏళ్ల అమ్మాయి పనిచేస్తూ ఉండేది. ఫిబ్రవరి 25వ తేదీన అమ్మాయిని నలుగురు వ్యక్తులు తీసుకుని వెళ్లిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, తల్లిదండ్రులు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, తర్వాత ఆ అమ్మాయి శవం మనోర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
ప్రమాదవశాత్తు మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, తమ కూతురిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని, అమ్మాయిని తీసుకుని వెళ్లిన ముఠా ఆ దురాగతానికి పాల్పడి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయిని చెప్పి, శవాన్ని చెట్టుకు వేలాడదీసి ఉంటారని అంటున్నారు .
అటవీ ప్రాంతంలోకి వెళ్లిన స్థానికులు అమ్మాయి శవం చెట్టుకు వేలాడుతుండడాన్ని చూశారు. పోలీసులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నివేదిక వస్తే మరణానికి గల కారణం తెలిసే అవకాశం ఉంది. అమ్మాయిపై అత్యాచారం జరిగిందా, లేదా అనేది కూడా పరీక్షల్లో తేలుతుందని అంటున్నారు.