గడువుకు ముందే టి బిల్లు, చర్చలు సాగుతాయి: షిండే
న్యూఢిల్లీ: నిర్ణీత గడువుకంటే ముందే తెలంగాణ బిల్లును తీసుకు వస్తామని, తెలంగాణ, విభజన సమస్యల పైన చర్చలు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం చెప్పారు. షిండే ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ బిల్లు త్వరలో వస్తుందని చెప్పారు. మంత్రుల బృందం(జివోఎం) కేబినెట్కు త్వరలో నివేదిక ఇస్తుందన్నారు. తెలంగాణపై చర్చల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
తమ ప్రభుత్వం పీరియడ్ కంటే ముందే బిల్లు వస్తుందన్నారు. అప్పటి వరకు చర్చలు ఉంటాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ విభజనపై అనేక ప్రతిపాదనలు చేసిందన్నారు. అఖిల పక్ష సమావేశంలో అన్ని అంశాల పైన చర్చిస్తామని చెప్పారు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాదు విషయంలో జివోఎంకు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయని, వాటన్నింటిని మంత్రుల బృందం పరిశీలిస్తుందని చెప్పారు.
ఇంతకుముందు పలుమార్లు అఖిలపక్షం నిర్వహించామని మరోసారి నిర్వహిస్తున్నామని చెప్పారు. నీటి పంపకం, రెవెన్యూ, విద్యుత్ తదితర సమస్యలు ఉన్నాయని, విభజనకు ముందు వాటిని పరిష్కరించాల్సి ఉందన్నారు. 371డి సంగతిని జివోఎం చూసుకుంటుందన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఎస్పీజి భద్రత కల్పించలేమని, అయినా భద్రత పెంచామన్నారు. మోడీ తమకు పెద్ద సవాల్ కాదన్నారు. కాంగ్రెసు ముందు దేశవ్యాప్తంగా పలు సవాళ్లున్నాయని చెప్పారు. పదేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. చైనా, బంగ్లాదేశ్, పాక్, మయన్మార్ సరిహద్దుల పైన చర్చలు కొనసాగుతున్నాయన్నారు.