కేంద్రంపై సబ్బం అవిశ్వాసం: ఎంపీలకు టి బిల్లు ప్రతులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బుధవారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అనంతరం సీమాంధ్ర టిడిపి ఎంపీలంతా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి నివాసంలో భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సబ్బం హరి కూడా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.
బిల్లు ప్రతులు సభ్యులకు
తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను లోకసభ సచివాలయం బుధవారం ఉదయం పార్లమెంటు సభ్యులకు అందజేసింది. గురువారం మధ్యాహ్నం లోకసభలో బిల్లును ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో బిల్లు ప్రతులు పంచారు. లోకసభ వ్యవహారాల జాబితాలో చేర్చి బిల్లును వెంటనే ఆమోదించాలని టిడిపి ఎంపి నామా నాగేశ్వర రావు కేంద్రాన్ని కోరారు.
మరోవైపు తెలంగాణ ముసాయిదా బిల్లుపై లోకసభ సెక్రటరీ జనరల్ కార్యాలయం న్యాయ సలహా కోరింది. ఆర్థిక నివేదికలతో కూడిన 69 పేజీలు బిల్లు ప్రతులను లోకసభ సచివాలయం ఈ రోజు సభ్యులకు అందించింది. బిల్లు పెట్టేందుకు రాష్ట్రపతి మంగళవారం అనుమతించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో... సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యేల నినాదాలతో శాసనసభ ప్రారంభమైన వెంటనే గంటపాటు వాయిదా పడింది. బుధవారం ఉదయం సభ ప్రారంభంకాగానే వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. ఇరు ప్రాంతాల సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను గంటపాటు వాయిదా వేశారు.