రాష్ట్రపతితో భేటీ సంతృప్తి: సురేష్ రెడ్డి, గీతారెడ్డి కంటతడి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ తమకు సంతృప్తినిచ్చిందని మాజీ శాసనసభ స్పీకర్ సురేష్ రెడ్డి తెలిపారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి సమావేశమయ్యారు. అనంతరం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎంపి రాపోలు ఆనంద భాస్కర్ మీడియాతో మాట్లాడారు.

రెండు రాష్ట్రాలుగా విడిపోతేనే రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమవుతుందని రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. విభజన జరుగుతున్నందున రెండు ప్రాంతాల మధ్య సామరస్యాన్ని పెంచాలని ఆయన కోరారు. రాష్ట్రపతికి తాము మూడు అంశాలను వివరించామని సురేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన బృందం అప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించామని చెప్పారు.

Telangana Congress leaders met President Pranab Mukherjee

ఆర్టికల్ 3ని సీమాంధ్ర నాయకులు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు వ్యవస్థను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సురేష్ విమర్శించారు. ఎవరెన్ని చేసినా తెలంగాణ ఏర్పాటు ఖాయమని ఆయన చెప్పారు. శాసనసభలో బిల్లును ఓడించి పంపామని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రపతిని కన్విన్స్ చేయగలిగామని సురేష్ పేర్కొన్నారు.

అవమానాలు బరించలేం: గీతారెడ్డి

తెలంగాణ రాష్ట్ర పోరాటం గత 60 ఏళ్లుగా కొనసాగుతోందని మంత్రి గీతారెడ్డి తెలిపారు. ఉద్యమంలో తెలంగాణ కోసం వెయ్యిమంది యువకులు తమ ప్రాణాలను కోల్పోయారే గానీ, ఏ ఒక్కరి ప్రాణాలకు హాని కలిగించలేదని ఆమె చెప్పారు. సీమాంధ్ర నాయకులు మెజార్టీ ఉంది కదా అని వారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని గీతారెడ్డి ఆరోపించారు. సిఎం, పిసిసి చీఫ్, శాసనసభ స్పీకర్ అందరూ సీమాంధ్ర ప్రాంతం వారే ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రాంతం పిల్లలు మరణించారని చెబుతూ గీతా రెడ్డి కంట తడి పెట్టారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ తల్లుల గర్భశోకాన్ని, తమ సమస్యలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నారని గీతారెడ్డి తెలిపారు. కేంద్రం కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించిందని చెప్పారు. తెలంగాణ బిల్లును కేంద్రం రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తే.. రాష్ట్రపతిని అవమానించే విధంగా బిల్లును చించివేయడం, మంటపెట్టారని ఆరోపించారు.

బిల్లుపై చర్చ కోసం వారం రోజులపాటు గడువు పొడిగించిన అనంతరం బిల్లు తప్పుల తడకగా ఉందని సిఎం కిరణ్ చెప్పడమేంటని, మొదట్నుంచి ఆ విషయం తెలియలేదా అని గీతారెడ్డి మండిపడ్డారు. తప్పులతడకగా ఉన్న బిల్లుపై చర్చించేందుకు గడువు ఎందుకు కోరారని ఆమె ప్రశ్నించారు. శాసనసభలో సభ్యులందరి ఆమోదం లేకుండానే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బిల్లును తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారని ఆరోపించారు. అందరి ఆమోదం లేకుండా అది ప్రభుత్వ తీర్మానం ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు.

ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నందుకు తమను పోలీసులతో కొట్టించారని సిఎంపై గీతారెడ్డి ధ్వజమెత్తారు. తాను, సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణ పోలీసుల తోయడంతో కిందపడిపోయామని తెలిపారు. మిగితా మంత్రులను కూడా తోసేశారని ఆమె చెప్పారు. ఈ అవమానాలను బరించలేమని, తమను గౌరవంతో బతకనివ్వండని రాష్ట్రపతిని కోరామని గీతారెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+