11న మంత్రుల బృందం భేటీ, వ్యతిరేకం కాదని శైలజానాథ్
న్యూఢిల్లీ: కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 11న ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంత్రుల బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఈ బృందంలో షిండేతో పాటు చిదంబరం, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, ఎకె ఆంటోనీ, జైరామ్ రమేష్, ప్రత్యేక ఆహ్వానితుడిగా నారాయణ స్వామిలు ఉన్నారు.
మంత్రుల బృందం నుంచి కొన్ని ముఖ్య శాఖలను తొలగించారు. జలవనరులు, విద్యుత్ శాఖ, పట్టణాభివృద్ది, న్యాయ శాఖ, మానవవనరుల శాఖ, ప్లానింగ్ కమిషన్ను తొలగించినట్లుగా తెలుస్తోంది. విభజనపై మంత్రుల బృందం ఎల్లుండి తొలిసారి భేటీ అవుతోంది.
డిగ్గీతో షబ్బీర్ అలీ భేటీ
ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను బుధవారం ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిగ్గీకి తాను తాజా రాజకీయ పరిస్థితులను వివరించానని, తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ బహిరంగ సభలపై తెలియజేశానని తెలిపారు.
తెలంగాణకు అనుకూలంగా రెండుసార్లు లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చిన్నపిల్లాడులా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన మినహా ఏ నిర్ణయం పైన అయినా మాట్లాడేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందన్నారు.
సమైక్య ఉద్యమకార్యాచరణ కమిటీ
పదిహేడు మందితో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ సమైక్య ఉద్యమ కార్యాచరణ కమిటీ ఏర్పాటయింది. సమన్వయకర్తగా మంత్రి శైలజానాథ్ ఉన్నారు. కమిటీలో పదిమంది మంత్రులు, ఒక ఎమ్మెల్సీ, ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడారు. తాము తెలంగాణకు వ్యతిరేకంకాదని, విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామన్నారు. జివోఎంలో తెలుగు వారు లేకపోవడం దురదృష్టకరమన్నారు.