21న క్యాబినెట్ ముందుకు టీ ముసాయిదా బిల్లు
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ఈ నెల 21వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) సంప్రదింపులను పూర్తి చేసిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. జివోఎం సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఆ విషయాలు చెప్పారు.
కాగా, జివోఎం చివరి సమావేశం ఈ నెల 21వ తేదీన జరుగుతుందని, 21వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు ఆ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సిఫార్సులతో కూడిన నివేదిక ముసాయిదాను జివోఎం ఖరారు చేస్తుంది. అదే రోజు కేంద్ర మంత్రివర్గం ముందుకు ఆ ముసాయిదా వస్తుంది. ఆ తర్వాత ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపే అవకాశం ఉంది.

తెలంగాణ ముసాయిదా బిల్లు డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర శాసనసభకు వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చినా, రాకపోయినా డిసెంబర్లో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆరు నెలలలోగా శాసనసభ సమావేశాలు జరగాల్సి ఉంటుంది కాబట్టి శీతాకాలం సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు. దీన్నిబట్టి తెలంగాణ బిల్లుపై అభిప్రాయం కోసం ప్రత్యేకంగా శాసనసభను సమావేశపరిచే అవకాశం లేదని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications