టి, కెసిఆర్పై మోడీ ట్వీట్, పదకొండుమంది ప్రమాణం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్లో తన శుభాకాంక్షలు అందించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, నవతెలంగాణ నిర్మాణం బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పారు.
భారత్లో మరొ కొత్త రాష్ట్రం వచ్చిందని, తెలంగాణను మన 29వ రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నామని, రానున్న కాలంలో దేశ భవిష్యత్తులో తెలంగాణ పాత్ర కూడా ఉంటుందని మోడీ ట్వీట్ చేశారు.
చాలా ఏళ్ల పోరాటం, ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన, ప్రాణత్యాగం చేసిన వారిని మోడీ గుర్తు చేసుకుంటూ మరో ట్వీట్ చేశారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అన్నారు.
తెలంగాణ ప్రజలకు, కొత్త ప్రభుత్వానికి కేంద్రం మద్దతు తప్పకుండా ఉంటుందని హామీ ఇస్తున్నామని, అభివృద్ధికి తోడ్పడుతామని మూడో ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో కెసిఆర్కు అభినందనలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కెసిఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, కెసిఆర్ సోమవారం ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కెసిఆర్ కేబినెట్లో హైదరాబాదు నుండి ముగ్గురుకి, కరీంనగర్ నుండి ఇద్దరికి, మెదక్, నిజాబాద్, నల్గొండ, అదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల నుండి ఒక్కొక్కరికి అవకాశం లభించిది. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు చోటు దక్కలేదు.
కెసిఆర్ కేబినెట్లో మహమూద్ అలీ, రాజయ్య, నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, హరీష్ రావు, కెటి రామారావు, పద్మారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జోగు రామన్న, జగదీశ్వర్ రెడ్డిలకు బెర్త్ దక్కింది.