అవిశ్వాసంపై రాత్రంతా ప్రయత్నాలు: రంగంలోకి అహ్మద్
బిజెడితో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, శివసేన, అకాలీదళ్, సమాజ్వాదీ పార్టీల మద్దతు కోసం సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా ఎంపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర ఎంపీలు సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, తెదేపా రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ దీని కోసం గట్టిగా కృషి చేస్తున్నారు.
అయితే అవిశ్వాసానికి మద్దతు పలికేందుకు మమతా సుముఖత చూపటం లేదు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతోపాటు రమేష్ సహా తెదేపా ఎంపీలు పార్లమెంటు సెంట్రల్ హాల్లో మమతను కలిసి మద్దతుకై విజ్ఞప్తి చేశారు. తృణమూల్కు లోక్సభలో 19మంది సభ్యుల బలం ఉంది.
కాగా, కాంగ్రెస్ ఎంపీలు వి హనుమంతరావు, ఎంఏ ఖాన్ మంగళవారం మధ్యాహ్నం మమతను కలిసి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల ఎంపీల వాదన విన్న తరువాత తమ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవచ్చని మమత చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు తమ తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు మంగళవారం రాత్రంతా తమ ప్రయత్నాలు కొనసాగించారు.
మరోవైపు సీమాంధ్ర ఎంపీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ రంగ ప్రవేశం చేశారు. అహ్మద్ మంగళవారం పార్లమెంటులోని రాజ్యసభ ఇన్నర్ లాబీలో బైఠాయించి వివిధ పక్షాల నేతలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపారు.
అహ్మద్ ఆదేశం మేరకు ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి నారాయణ స్వామి, కాంగ్రెస్ విప్లు ఎంఏ ఖాన్, మధుయాష్కీ, చీప్విప్ సందీప్ దీక్షిత్ వివిధ పక్షాల నేతలను కలిసి సీమాంధ్ర ఎంపీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. వారు సీనియర్ నేతలను అహ్మద్ వద్దకు తీసుకుపోయి మాట్లాడించారు. అహ్మద్ రాజ్యసభ లాబీలో బైఠాయించి ఎస్పీ, బిఎస్పీ పార్టీల నేతలను కలిసి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకూడదని సూచించటం గమనార్హం.