టీఎంసీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్: సంతోషమంటూ మమతా బెనర్జీ
కోల్కతా: దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో చేరారు. ఆయనతోపాటు నటి నఫీసా అలీ కూడా టీఎంసీలో చేరారు. గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో మమతా బెనర్జీ గోవాలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగానే వీరు టీఎంసీలో చేరినట్లు పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
గోవా రాజధాని పనాజీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. లియాండర్ పేస్ టీఎంసీలో చేరారని తెలియడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన తనకు సోదర సమానుడని వ్యాఖ్యానించారు. తాను యువజన శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఆయన తనకు తెలుసని తెలిపారు.

తాను గోవాకు వచ్చింది ముఖ్యమంత్రి అయ్యేందుకు కాదని, బీజేపీ దాదాగిరికి చెక్ పెట్టేందుకేనని అన్నారు. స్థానిక కొంకణీ భాషలో మాట్లాడి అక్కడివారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తాను బయటి వ్యక్తిని కాదని, భారతీయురాలినని అన్నారు. తాను ఎక్కడికైనా వెళ్లగలనని అన్నారు.
We are elated to share that Nafisa Ali and Mrinalini Deshprabhu have joined the Goa Trinamool Congress family today in the presence of our Hon'ble Chairperson @MamataOfficial.
— All India Trinamool Congress (@AITCofficial) October 29, 2021
We wholeheartedly welcome both leaders! pic.twitter.com/W5eAlKpmR2
పశ్చిమబెంగాల్ తన మాతృభూమి అయితే.. గోవా కూడా తన మాతృభూమేనని అన్నారు మమతా బెనర్జీ. తాను గోవా సీఎం అయ్యేందుకు రాలేదని, ఢిల్లీ నుంచి ఎదురయ్యే దాదాగిరిని అడ్డుకోవడానికి వచ్చానని అన్నారు. వారి మనసు కలుషితమైందన్నారు. వారు తనకు నల్లజెండాలు చూపించారని, తాను మాత్రం నమస్కారమే పెట్టానని బీజేపీపై విమర్శలు చేశారు.
తామంతా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని చెప్పారు మమత, గోవా చాలా అందంగా ఉంటుందన్నారు. మనకు చేపలంటే ఇష్టమని, మన రెండు రాష్ట్రాలు ఫుట్బాల్ను ప్రేమిస్తాయంటూ గోవా, బెంగాల్ రాష్ట్రాలను పోలుస్తూ మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. కాగా, పశ్చిమబెంగాల్ ఎన్నికల సందర్భంలో బీజేపీ జాతీయ నేతల రాకపై స్థానికేతరులంటూ మమత విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ తాను బయటి వ్యక్తిని కానంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. గోవాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications