లగడపాటి రాజగోపాల్ దిష్టి బొమ్మ: ఎపి భవన్లో ఉద్రిక్తత
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎపి భవన్ వద్ద ఆదివారం మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ దిష్టి బొమ్మను తెలంగాణవాదులు దగ్ధం చేసే ప్రయత్నం చేయగా, సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శనివారం రాత్రి లగడపాటి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ప్రయత్నించింది. దానిని అడ్డుకోవడంతో ఆదివారం ఉదయం దగ్ధం చేయాలని చూసింది. దానిని సమైక్య విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి అడ్డుకుంది. ఈ సమయంలో ఇరు ప్రాంతాల నేతలు పోటా పోటీగా నినాదాలు చేశారు.
కాగా, లోక్ సభలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సభ్యుల తీరుపై బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. లగడపాటి వ్యవహరించిన తీరును దేశం యావత్తూ ఖండిస్తుంటే, కొందరు సమర్థిస్తుండడం అప్రజాస్వామికమన్నారు. రేపటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి మద్దతిస్తుందన్నారు.
తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఎంపీలు లగడపాటి, మోదుగులను తప్పుబట్టడం సరికాదన్నారు. భౌతికదాడులకు తెరదీసిన ఎంపీలే మొదటి ముద్దాయిలన్నారు. ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ తెలుగుజాతి మధ్య చిచ్చు పెడుతోందన్నారు. ముస్సోలిని పుట్టిన ఇటలీ నుండి వచ్చిన సోనియా, భారత్కు వచ్చి ఘాంధీ పుట్టిన ఈ దేశాన్ని కళంకితం చేస్తోందన్నారు.