జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో టెన్షన్: చొరబాట్లకు సిద్ధంగా 200మంది ఉగ్రవాదులు; ధృవీకరించిన ఆర్మీ!!
భారతదేశానికి ఉగ్రవాదులతో ప్రమాదం పొంచి ఉందా? భారతదేశంపై దాడులు చేయడానికి, అలజడి సృష్టించటానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి భారతదేశంలోకి ఉగ్రవాద మూకలు చొరబాట్లకు రెడీ అయ్యాయా? ఆఫ్ఘనిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల సహకారంతో భారత్ లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారా ? అంటే అవును అన్న సమాధానమే ఇంటిలిజెన్స్ వర్గాల నుండి వస్తోంది. ఇక ఇదే విషయాన్ని ధృవీకరించారు ఆర్మీ అధికారి.
ఉగ్రవాదుల చొరబాట్లపై ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో టెన్షన్ పరిస్థితి నెలకొంది. జమ్ము కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లు బాగా తగ్గాయని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్లోకి చొరబడేందుకు దాదాపు 200 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి వేచి ఉన్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం తెలిపారు. సరిహద్దుల్లో భారీగా గస్తీ పెంచామని పేర్కొన్నారు.
చొరబాట్లకు సిద్ధమైన 200 మంది ఉగ్రవాదులు
ఇండో-పాక్ సరిహద్దు వెంబడి టెర్రరిస్టులు సుమారు 200 మంది ఉగ్రవాదులు (ఎల్ఓసి) ఇటువైపు చొరబాట్లకు వేచి ఉన్నారని పేర్కొన్న ఆయన ఆరు ప్రధాన ఉగ్రవాద శిబిరాలు, 29 మైనర్ క్యాంపులు, వివిధ సైనిక క్యాంపులకు సమీపంలో తాత్కాలిక లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయని తమకు సమాచారం ఉందని పేరు వెల్లడించారు. పర్వత ప్రాంతాలు, అడవుల గుండా మాత్రమే కాకుండా జమ్ము పంజాబ్ నేపాల్ చొరబాట్లు చేయడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
పాక్ సహకారంతోనే చొరబాటు యత్నాలు
ఉగ్రవాద మూకలు వివిధ సైనిక సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశారు . ఉగ్రవాదుల చొరబాట్లపై పాక్ సైన్యం మరియు ఇతర ఏజెన్సీల భాగస్వామ్యాన్ని తిరస్కరించలేమని ఆయన తెలిపారు. ఉగ్రవాద మూకలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని పాకిస్తాన్ సైన్యం పై ఆరోపణలు గుప్పించారు. పాక్ సహకారంతోనే చొరబాటు యత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు,
రంగంలోకి రిజర్వ్ బలగాలు
ఫిబ్రవరి 2021 ఒప్పందం నుండి ఇండో-పాక్ సరిహద్దులో కాల్పుల విరమణ బాగా పనిచేస్తోందని పేర్కొన్న ఉపేంద్ర ద్వివేది భారత్ తీసుకుంటున్న చర్యలతో చొరబాట్లు బాగా తగ్గాయని అన్నారు. తాము అన్ని రిజర్వ్ దళాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు. తద్వారా ఎటువంటి చొరబాట్లు జరగకుండా చూసుకున్నామని తెలిపారు. గత పన్నెండు నెలల్లో, కాల్పుల విరమణ ఉల్లంఘనల సంఖ్య చాలా పరిమితంగా ఉందని వెల్లడించారు. గత పన్నెండు నెలల్లో ఒకటి నుండి మూడు మాత్రమే కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నారు.
ఉగ్రవాద స్థావరాలపై నిఘా పెట్టారన్న ఉపేంద్ర ద్వివేది
విదేశీ ఉగ్రవాదులతో పాటు రహస్య ప్రాంతాల్లో ప్రస్తుతం నలభై నుంచి యాభై మంది స్థానిక ఉగ్రవాదులు పనిచేస్తున్నారని ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఇతర దేశాల నుండి వచ్చిన ఉగ్రవాదుల సంఖ్య కచ్చితంగా తెలియదని, కానీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 21 మందిని మట్టుబెట్టామని వెల్లడించారు. అయితే నిషేధిత సంస్థలో స్థానికంగా యువత పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపైన కూడా ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.