ఎన్ఐఏకే సవాల్ విసిరిన తీవ్రవాదులు ? ముంబైని పేల్చేస్తేమంటూ.. !
ముంబైలో గతంలో జరిగిన స్ధాయిలో తీవ్రవాద దాడి చేస్తామంటూ ఎన్ఐఏకు తాజాగా ఓ మెయిల్ అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఎన్ఐఏ ఉమ్మడిగా దర్యాప్తు ప్రారంభించాయి.
భారత దేశ వాణిజ్య రాజధాని ముంబైని తీవ్రవాదులు మరోసారి లక్ష్యంగా చేసుకోనున్నారనే వార్తలు కలకలం రేపాయి. ఈ మేరకు ఎన్ఐఏకి ఓ మెయిల్ అందింది. ఇందులో ముంబైపై తీవ్రవాద దాడి చేస్తామంటూ అగంతకులు ఈ మెయిల్ పంపారు. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్ఐఏ సాయంతో దర్యాప్తు ప్రారంభించారు.
ముంబై మరోసారి ఉలిక్కిపడింది. గతంలో జరిగిన తీవ్రవాద దాడుల తరహాలోనే మరోసారి నగరాన్ని పేల్చేస్తామంటూ హెచ్చరిస్తూ ఏకంగా ఎన్ఐఏకే ఆగంతకులు బెదిరింపు మెయిల్ పంపారు. దీంతో వెంటనే ఈ సమాచారాన్ని ఎన్ఐఏ ముంబై పోలీసులకు పంపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహారాష్ట్ర మొత్తాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఈ మెయిల్ పంపిన వ్యక్తి తనను తాను తాలిబన్ గా ప్రకటించుకున్నాడు. ముంబైపై తాము దాడి చేయబోతున్నట్లు మెయిల్ లో బెదిరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గతనెలలో ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ను పేల్చేస్తామంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. స్కూల్లో టైంబాంబు పెట్టినట్లు అందులో అగంతకులు బెదిరించారు. గతేడాది అక్టోబర్ లోనూ ముంబైలోని పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్పటి నుంచి పోలీసులకు కంటి మీద కునుకులేకుండా పోతోంది. ఇందులో ఏది నిజమో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు.