ఫ్లాపైన మోడీ సభకు టెర్రరిస్ట్స్ హెల్ప్!: నితీష్ నిప్పులు
పేలుళ్లు జరక్కపోయివుంటే మోడీ సభకు జనం పలచగా హాజరైన విషయం పైనే చర్చ జరిగి ఉండేదన్నారు. ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడటం ఖండించాల్సిన విషయమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని అయితే, పేలుళ్ల వల్ల జనం పలచగా హాజరైన విషయం మరుగున పడిపోయిందన్నారు. ఈ రకంగా ఉగ్రవాదులు బిజెపికి సాయపడ్డారని ఎద్దేవా చేశారు.
హూంకార్లో జరిగిన సభలో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడితే, నితీష్లో చలనం లేదని, జెడి(యు) సదస్సులో తలమునకలై ఉన్నారని చత్తీస్గఢ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ఆరోపించిన విషయం విదితమే. దీనిపై నితీష్ స్పందించారు. మోడీ మళ్లీ తప్పటడుగు వేశారని, అక్టోబర్ 27న హాజరుకావాల్సి ఉన్న అంతర్జాతీయ యోగా సదస్సు కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, అక్కడినుంచి రాజ్గిర్ వచ్చానని, ఇది రికార్డుల్లో కూడా ఉందని, దీన్ని ఎవరైనా పరీక్షించుకోవచ్చనని చెప్పారు.
మోడీ సభలో జరిగిన పేలుళ్లపై తనను, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందన్న హిట్లర్ మాటను బిజెపి నాయకులు పాటిస్తున్నారని నితీష్ ఆరోపించారు. సభ జరిగిన గాంధీ మైదాన్ మూడొంతులు ఖాళీగానే ఉందని, అక్కడ ఏ రాజకీయ పార్టీ కార్యక్రమాలు జరిగినా సాధ్యమైనంత ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేస్తామని నితీష్ పేర్కొన్నారు.