రెచ్చిపోయిన పాక్ ఉగ్రవాదులు.. మంత్రి కాన్వాయ్ పై గ్రనేడ్లతో దాడి, కాల్పులు
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని ట్రాల్లో ఏకంగా ఓ మంత్రి కాన్వాయ్పైనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడికి దిగారు. అనంతరం కాల్పులు జరిపి అక్కడ్నంచి పారిపోయారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ కు దక్షిణంగా 25 మైళ్ల దూరంలో ఉన్న పుల్వామా జిల్లాలోని ట్రాల్లో ఏకంగా ఓ మంత్రి కాన్వాయ్పైనే గ్రనేడ్లతో దాడికి దిగారు. అనంతరం కాల్పులు జరిపి, అక్కడ్నించి పారిపోయారు.
మంత్రి నయీం అక్తర్ కాన్వాయ్ బస్టాండ్ సమీపంలోకి రాగానే... పోలీసు వాహనంపై తొలుత కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అనంతరం గ్రనేడ్లు విసిరినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు మరో 24 మంది గాయపడ్డారు.
#Visuals from J&K: 5 civilians injured in grenade attack in Tral's bus stand, brought to hospital in Srinagar pic.twitter.com/2q1pjtrAwZ
— ANI (@ANI) September 21, 2017
ఈ ఉగ్రదాడి నుంచి మంత్రి నయీం అక్తర్ సురక్షింతంగా బయటపడ్డారు. దాడి గురించి తెలియగానే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ప్రత్యేక వలయంగా ఏర్పడి ఆయనను హుటాహుటిన ఘటనా స్థలికి దూరంగా తీసుకెళ్లారు.
ఉగ్రదాడి జరిగిన ప్రదేశం.. తెగిపడిన శరీరభాగాలు, రక్తపు మరకలతో భీతావహంగా మారింది. మరోవైపు దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.