థాంక్గాడ్: కేజ్రీ ప్రభుత్వంపై జైట్లీ సెటైర్స్, దారిలేదని షీలా
న్యూఢిల్లీ: నలభై తొమ్మిది రోజుల ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ప్రభుత్వ పాలన ఢిల్లీ చరిత్రలో ఒక పీడకలగా గుర్తుండి పోతుందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. అందుకు జైట్లీ దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు. ఒక సిద్ధాంతం, విధానం లేకుండా కేవలం ప్రజలను ఆకట్టుకునే నినాదాలు, ప్రజాకర్షణ హామీలతో ఆప్ ప్రభుత్వం కాలక్షేపం చేసిందని ఆరోపించారు.
ఢిల్లీ చరిత్రలో ఇంత వరకూ ఎఎపి వంటి అధ్వన్నమైన ప్రభుత్వం రాలేదని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు ఆ పార్టీ బాట వేస్తుందని ఆశించిన ప్రతి ఒక్కరికి నిరాశే మిగిలిందని ఆయన చెప్పారు. 49 రోజుల పాలనలో ప్రచారం తప్పించి కేజ్రీవాల్ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు.
ప్రతి ఒక్కరితో ఘర్హణ పడటం, తాము తప్పించి మిగిలిన వారంతా అవినీతి పరులేనన్న తీరులో వ్యవహరించారని బిజెపి నేత ఎద్దేవా చేశారు.
28 స్థానాలతో కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఎన్నికైన వారికి అనుభవం లేదని, ప్రభుత్వం నడపటానికి కావలసిన పరిపక్వత లేదని, అభివృద్ధి, సంక్షేమంపై బుర్ర పెట్డకుండా అనవసరమైన వివాదాలలో తలదూర్చారన్నారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన లోక్పాల్ బిల్లుకు తాము తీసుకొచ్చిన జన్ లోక్పాల్ బిల్లు గొప్పదని చెప్పుకున్న కేజ్రీవాల్ దానికి సభ ఆమోదం లేదన్న కారణంతో రాజీనామా చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన రాజీనామా రాజకీయ డ్రామా అన్నారు.
కేజ్రీవాల్ సిఎంగా చేసిన ప్రమాణాలను ఉల్లంఘించారని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. సభలో విశ్వాసం కోల్పోయిన కేజ్రీవాల్ ప్రభుత్వానికి వైదొలగడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు.