ఎమ్మెల్యే కారు నిలిపి వేటకొడవళ్లు చూపించి ?, బళ్లారిలో రాత్రి ఏం జరిగింది ? !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పూర్తి అయిన తరువాత వర్గ పోరు మొదలైయ్యింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మద్య మామూలుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే మూడు సార్లు ఎమ్మెల్యే అయిన నాయకుడిని కొందరు కత్తులతో బెదిరించారు. ఎమ్మెల్యేని వేటకొడవళ్లతో బెదిరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
బళ్లారి రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బళ్లారి రెడ్డి బ్రదర్స్ అంటేనే ఆ ప్రాంతంలో ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. బళ్లారిలో దశాభ్దాల నుంచి కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురౌతోంది. మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాకు దూరం అయిన తరువాత ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి జిల్లాలోని అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి బీజేపీ మంత్రి బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేంద్ర పోటీ చేశారు. ఇద్దరూ వాల్మీకి కులానికి చెందిన నాయకులు కావడంతో హోరాహోరీగా పోటీ నెలకొనింది.
పోలింగ్ రోజే బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌడ అనే వ్యక్తిని చితకబాదడంతో అతనికి తీవ్రగాయాలైనాయి, ఆ గొడవ బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో మంత్రి శ్రీరాములు కొంప ముంచేసింది. తరువాత ఓటింగ్ బీజేపీకి వ్యతిరేకంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగేంద్ర కు 1, 03, 836 ఓట్లు రాగా మంత్రి బళ్లారిశ్రీరాములుకు 74, 536 ఓట్లు మాత్రమే వచ్చాయి.

నాగేంద్ర చేతిలో బీజేపీ నాయకుడు శ్రీరాములు చిత్తుగా ఓడిపోయారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాగేంద్ర రాత్రి బళ్లారిలోని ఆయన మద్దతుదారుడి ఇంటికి వెళ్లారు. బళ్లారిలోని స్నేహితుడి ఇంటికి వెళ్లి తరువాత తిరిగి వెలుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్ర కారును అడ్డగించిన కొందరు వేటకొడవళ్లతో బెదిరించారు.
ఆ సమయంలో నిందితుల చేతిలో మారణాయుధాలు ఉండటంతో ఎమ్మెల్యే నాగేంద్ర కారు దిగకుండా కారులోనే ఉండిపోయారు. తరువాత ఎమ్మెల్యే నాగేంద్ర భద్రతా సిబ్బంది నిందితులను వెంబడించడంతో అక్కడి నుంచి పరారైనారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్రను కత్తులతో బెదిరించిన కేసులో బళ్లారిలోని కౌల్ బజార్ పోలీసులు వెంకటేష్, రమేష్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు.
అయితే తనను కత్తులో బెదిరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్ర కాని, ఆయన మద్దతుదారులు కాని కేసు పెట్టలేదని, తామే స్వయంప్రేరితంగా కేసు నమోదు చేశామని, పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని బళ్లారిలోని కౌల్ బజార్ పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్ర బళ్లారిలోని బీజేపీ నాయకులు, మాజీ మంత్రి శ్రీరాములకు భయపడి కేసు పెట్టలేదని బళ్లారి ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications