నా వల్ల నా తండ్రి దేవేగౌడకు నల్లటి మచ్చ, జీవితంలో పెద్ద తప్పు చేశా, సీఎం కుమారస్వామి!
బెంగళూరు: తన కారణంగా తన తండ్రి హెచ్.డి. దేవేగౌడ రాజకీయ జీవితానికి నల్లటి మచ్చ వచ్చిందని, ఇప్పుడు ఆమచ్చను చెరిపేయడానికి అవకాశం వచ్చిందని, గతంలో తాను బీజేపీ నాయకులతో పొత్తుపెట్టుకుని చాల పెద్ద తప్పు చేశానని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా తన తండ్రి హెచ్.డి. దేవేగౌడ శక్తి వంచన లేకుండా పని చేశారని, అలాంటిది గతంలో తాను తీసుకున్న నిర్ణయంతో ఆయనకు చెడ్డపేరు వచ్చిందని హెచ్.డి. కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం బలపరీక్ష సందర్బంగా శాసన సభలో కుమారస్వామి చాల తెలివిగా మాట్లాడారు.
Recommended Video
బీజేపీకి చేతకాలేదు
2006 నుంచి 2007 వరకు బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో 20 నెలల పాటు తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నానని హెచ్.డి. కుమారస్వామి గుర్తు చేశారు. తన 20 నెలల అధికారంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లానని, తరువాత అధికారంలో వచ్చిన బీజేపీ చేతకానితనంతో ప్రభుత్వం కుప్పకూలిపోయిందని కుమారస్వామి ఆరోపించారు.
బీజేపీతో పొత్తు లేదు
తన తండ్రి దేవేగౌడను ఎదిరించి తాను బీజేపీ నాయకులతో కలిసి 2006లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యానని కుమారస్వామి అన్నారు. అయితే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో తాను పొత్తు పెట్టుకోలేదని, బెంగళూరులో యడ్యూరప్పతో మాత్రం పొత్తు పెట్టుకున్నానని, ఆ సమయంలో కేఎస్. ఈశ్వరప్ప మా పక్కనే ఉన్నారని హెచ్ డి. కుమారస్వామి అన్నారు. తాను ఓ వ్యక్తి (యడ్యూరప్ప)తో మాత్రమే పొత్తు పెట్టుకున్నానని కుమారస్వామి వివారణ ఇచ్చారు.
రెండు నెలలకే సినిమా
తాను ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షం అయిన బీజేపీ నాయకులు తన మీద ఆరోపణలు చేశారని కుమారస్వామి మండిపడ్డారు. బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి తనకు రూ. 150 కోట్లు లంచం ఇచ్చారని ఆరోపించారని, ఆ సమయంలో బీజేపీ నాయకులు ఆయన్ను ఎందుకు ప్రశ్నించలేదని కుమారస్వామి నిలదీశారు.
ప్రజల కోసం ఓపిక
తాను సీఎంగా ఉన్న సమయంలో బీజేపీ నాయకులు సంకీర్ణ ప్రభుత్వం అని కూడా ఆలోచించకుండా లేనిపోని ఆరోపణలు చేశారని. 20 నెలల పాటు ప్రజలు కోసం ఓపికగా ఉన్నానని కుమారస్వామి చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని జీవితంలో చాల పెద్దతప్పు చేశానని, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నానని కుమారస్వామి అన్నారు.
అధికార దాహం లేదు
తాను కాని, తన తండ్రి హెచ్.డి. దేవేగౌడకు కాని, మా కుటుంబ సభ్యులకు కాని అధికార దాహంతో ఎవరి దగ్గరకు వెళ్లలేదని హెచ్.డి. కుమారస్వామి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ముందుకు రావడంతో జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు తాము పొత్తు పెట్టుకున్నామని హెచ్.డి. కుమారస్వామి వివరణ ఇచ్చారు.