పాటల గొడవ: బర్త్ డే బాయ్ ని కొట్టి చంపేశారు
గుర్గావ్: పుట్టిన రోజు వేడుకలలో పాటలు ప్లే చేసే విషయంలో గొడవ జరిగి బర్త్ డే బాయ్ హత్యకు గురైన దారుణ సంఘటన గుర్గావ్ లో జరిగింది. హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నామని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ హవా సింగ్ చెప్పారు.
పోలీసు అధికారి హవా సింగ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్గావ్ లోని సుభాష్ నగర్ ప్రాంతంలోని క్రిష్ణా కాలనీలో రోహిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను బీబీఏ విద్యాభ్యాసం చేస్తున్నాడు.
మంగళవారం (అక్టోబర్ 20) రోహిత్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఇంటి దగ్గర బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశాడు. రాత్రి స్నేహితులు, బంధువులు రావడంతో పాటలు పెట్టుకుని డ్యాన్స్ లు వేస్తూ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
ఆ సందర్బంలో కొందరు అక్కడికి వెళ్లి తమకు ఇష్టమైన పాటలు పెట్టాలని, తాము డ్యాన్స్ లు వేస్తామని అన్నారు. అందుకు రోహిత్ నిరాకరించాడు. అయితే మీరు ఇక్కడ బర్త్ డే పార్టీ జరుపుకోవడానికి తాము అంగీకరించమని గొడవకు దిగారు.
తన ఇంటి దగ్గర బర్త్ డే పార్టీ జరుపుకుంటుంటే మీరెవ్వరు అడ్డుకోవడానికి అని రోహిత్ ఎదురు తిరిగాడు. అంతే సహనం కొల్పోయిన నిందితులు ఇనుప రాడ్లు, హాకి స్టిక్స్ తీసుకుని రోహిత్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సృహ తప్పిన రోహిత్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించాడని పోలీసు అధికారి హవా సింగ్ చెప్పారు. బర్త్ డే రోజు రోహిత్ హత్యకు గురి కావడంతో అతని కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. పోలీసులు ఇప్పటికే కొందరు నిందితులను గుర్తించారు.