రైతులకు తీపికబురు చెప్పిన కేంద్రం.. 35పైసల వడ్డీకే రుణాలు.. త్వరపడండి!
రైతన్నలకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఎవరిని అప్పు అడిగే అవసరం లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచింది. అతి తక్కువ వడ్డీకి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కావలసిన ఆర్థిక భరోసాను కల్పించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో రైతులకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెప్పిన తీపి కబురుతో రైతులు పంటలు పెట్టుబడికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయింది.
కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంపు
బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణ పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచినట్టు నిర్మల సీతారామన్ చెప్పడం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది రైతులకు లబ్ధిని చేకూర్చింది. దేశవ్యాప్తంగా కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్య 7.75 కోట్లుగా ఉండగా, ఇప్పటివరకు కిసాన్ క్రెడిట్ కార్డు కింద రైతులకు 9.81 లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా అందించారు.

రైతాంగానికి పంట పెట్టుబడికి కిసాన్ క్రెడిట్ కార్డు
రైతులు విత్తనాలు కొనుగోలు చేసుకోవడానికి, ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ పరికరాలను సకాలంలో కొనుగోలు చేసుకోవడానికి వీలుగా 1998లో ప్రారంభించిన ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ రైతాంగానికి తోడ్పడుతుంది. అయితే ఇంతకాలం కిసాన్ క్రెడిట్ కార్డు కింద రైతులకు మూడు లక్షల రూపాయల వరకు మాత్రమే రుణాలు ఇస్తున్నారు.
సకాలంలో చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ
కానీ ఇకపై రైతులకు ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు అది కూడా సంవత్సరానికి 7% వడ్డీ రేటు తో అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రైతులు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తే వారికి మూడు శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రేటు నాలుగు శాతం ఉంటుంది. అంటే దాదాపు 35 పైసల వడ్డీ రేటు తోనే రైతులకు కేంద్రం రుణాలు ఇవ్వనుంది.
కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలంటే
ఇప్పటివరకు కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని పొందుతున్నారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు లేనివారు రైతు అయి ఉండి 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులో, గ్రామీణ బ్యాంకులో, సహకార సంఘాల నుంచి కిసాన్ క్రెడిట్ కార్డులను పొందవచ్చు.
వడ్డీ రాయితీ బెనిఫిట్ అప్పుడే
కిసాన్ క్రెడిట్ కార్డు కింద వ్యవసాయ రుణాలు తీసుకున్న వారు సంవత్సరానికి రెండు సార్లు వడ్డీ చెల్లించాలి . రైతు సంవత్సరానికి రెండు సార్లు వడ్డీని చెల్లించి మొత్తం రుణ మొత్తాన్ని ఒకసారి జమ చేసిన తర్వాత మాత్రమే వడ్డీ రాయితీని పొందగలుగుతాడు. ఇక ఈ విధంగా చెయ్యని వారు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ తీసుకున్నప్పటికీ ఏడు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో వడ్డీ చెల్లించకపోతే ఖాతా కూడా ఎన్పీఏగా మారే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం రైతాంగం కోసం అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు రైతాంగానికి నిజంగా వరం అని చెప్పాలి.












Click it and Unblock the Notifications