సౌభ్యాగ్య స్కీం, రూ. కోటి నామం: బ్యాంక్ అధికారి అరెస్టు
బెంగళూరు: ఫిక్సెడ్ డిపాజిట్ల పేరుతో ఖాతాదారులను మోసం చేస్తున్న ప్రసిద్ది చెందిన ప్రయివేటు బ్యాంకు అధికారిని బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు అరెస్టు చేశారు. కబ్బన్ పార్క్ సమీపంలోని కస్తూరిబా రోడ్డులోని ఎస్ బ్యాంకు అధికారి స్నేహల్ సతీష్ (36) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
గత నాలుగు నెలల్లో ఇతను ఖాతాదారులను మోసం చేసి రూ. ఒక కోటి వసూలు చేసి చీటింగ్ చేశాడని బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ సందీప్ పాటిల్ అన్నారు. ఇతను ఎస్ బ్యాంకులో బిజినెస్ విభాగం వైస్ ప్రసిడెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో మంచిగా ఉంటున్నట్లు నటించాడు. తమ బ్యాంకులో ‘ఎస్ సౌభాగ్య ' అనే పేరుతో కొత్త ఫిక్సెడ్ డిపాజిట్ స్కీం అందుబాటులోకి తీసుకు వచ్చామని, 14 శాతం వడ్డి ఇస్తామని ఖాతాదారులను నమ్మించి మోసం చేశాడు.
అప్పు ఇచ్చిన మహిళ పేరే పెట్టుబడి............!
సౌభాగ్య అనే మహిళ దగ్గర స్నేహల్ సతీష్ రూ. 40 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణం చెల్లించడానికి అనేక ప్లాన్ లు వేశాడు. చివరికి అప్పు ఇచ్చిన మహిళ సౌభాగ్య పేరును అతను తన కొత్త స్కీంకు పెట్టుబడిగా పెట్టాడు. సౌభాగ్య స్కీంలో నగదు డిపాజిట్ చెయ్యడానికి ఆసక్తి చూపించిన ఖాతాదారులను గుర్తించాడు.
తరువాత వారి దగ్గర చెక్ లు తీసుకున్నాడు. చెక్ ల మీద సౌభాగ్య అనే పేరు వ్రాసి, అందులో రుణం ఇచ్చిన మహిళ సౌభాగ్య అకౌంట్ నెంబర్ వేసి నగదు బదిలి చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇతను బ్యాంకు లెటర్ హెడ్ లు దుర్వినియోగం చేశాడని బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారని పోలీసులు అధికారులు తెలిపారు.