బీజేపీని ‘కలిసుందాం రా’అంటున్న శివసేన
ముంబై: ముంబై సమీపంలోని కల్యాన్ -దొంబివాలి (కేడీఎంసీ) మున్సిపాలిటి ఎన్నికల్లో బీజేపీ-శివసేన పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంతా అని విమర్శలు చేసుకున్నాయి. పరస్పరం బురద చల్లుకున్నాయి.
ఇప్పుడు ఎన్నికలు పూర్తి అయ్యాయి. శివసేన అత్యధిక సీట్లు గెలుచుకుని మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. అయితే అధికారంలో కుర్చోవడానికి శివసేనకు కావలసిన మెజారిటి లేదు.
ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, అధికారంలో మనం ఉండాలంటే చేతులు కలపాలని శివసేన బీజేపీకి సూచించింది. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఇలా సూచించింది. ఎన్నికల సమయంలో జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనం కలిసి ముందుకు వెళుదాం రండి అంటూ సూచించింది.
కల్యాణ్-దొంబివాలి మున్సిపాలిటీ అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నాం, అయినా తమకు పూర్తి మెజారిటి రాలేదు, ఈ నేపద్యంలో అందరిని కలుపుకుని ముందుకు వెళ్లి అభివృద్ది చెయ్యడానికి సిద్దం అయ్యామని అందుకు సహకరించాలని సామ్నాలో బిజెపితో స్నేహ హస్తం చాచింది.