జనతా గ్యారేజ్ కు తమిళనాడులో దెబ్బ
హోసూరు/బెంగళూరు: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో విడుదల కాకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు.
కర్ణాటక సరిహద్దులోని క్రిష్ణగిరి, ధర్మపురి (తమిళనాడు) జిల్లాల్లో జనతా గ్యారేజ్ సినిమా విడుదల కావడంలేదని బుధవారం సాయంత్రం తెలుసుకున్న అభిమానులు బెంగళూరుకు పరుగు తీశారు.
బెంగళూరు నగరంలోని పలు థియేటర్లలో టిక్కెట్లు తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. క్రిష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లోని కొన్ని థియేటర్ల యజమానులు జనతా గ్యారేజ్ సినిమా పంపిణిదారులను (బెంగళూరు)సంప్రధించారు. అయితే వారు చెప్పిన రేటుకు సినిమా హక్కులు అమ్మడానికి పంపిణిదారులు అంగీకరించలేదు.
జనతా గ్యారేజ్ సినిమా టిక్కెట్లు ఎక్కువ ధరకు విక్రయించరాదని తమిళ సినిమా హీరోల అభిమానులు అడ్డుపడటం వలనే అక్కడ సినిమా విడుదల కావడం లేదని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.
ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా గతంలో ఇదే విషయంలో విడుదల చెయ్యలేదు. నెల రోజుల తరువాత హోసూరు తదితర ప్రాంతాల్లో నాన్నకు ప్రేమతో సినిమా విడుదల చేశారు.