జయలలిత ఆరోగ్యంపై పుకార్లు: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్టు
చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై దుష్ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురి చేసిన వ్యక్తుల్లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో సహ ఇద్దరిని చెన్నై నగర క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు సతీష్ కుమార్ (26), మదాసమి (25) అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల కథనం మేరకు సతీష్ ఎంసీఏ చదివాడు.
ఇతను ప్రస్తుతం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా పని చేస్తున్నాడు. మదాసమి వాలచేరీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. మదాసమి ఓ వెబ్ సైట్ లో అపోలో ఆసుపత్రి ఉద్యోగి చెప్పినట్లుగా ఉన్న ఆడియోను పెట్టి జయలలిత ఆరోగ్యంపై దుష్ప్రచారం చేశాడు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీష్ కుమార్ ఫేస్ బుక్ లో జయలలిత ఆరోగ్యంపై దుష్ప్రచారం చేశాడు. వీరిద్దరు జయలలిత ఆరోగ్యంపై ప్రజలు భయపడే స్థాయిలో ఆడియో క్లిప్పింగ్ లు, సందేశాలు పెట్టారని అన్నాడీఎంకే ఐటీ విభాగం సెక్రటరీ కేఆర్. రామచంద్రన్ గుర్తించారు.
కేఆర్. రామచంద్రన్ ఫిర్యాదు చెయ్యడంతో చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి సతీష్ కుమార్, మదాసమిని అరెస్టు చేశారు.