అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను నిజం చేశారు: ఢిల్లీ ఎన్నికల వాయిదా కోసం బీజేపీ కుట్ర: ఆప్, సీపీఐ..!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా దేశ రాజధానిలో ఆందోళన చేపట్టిన జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రదర్శనకారులపై రామ్ భగత్ గోపాల్ శర్మ అనే యువకుడు కాల్పులు జరపడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీపీఐ నిప్పులు చెరుగుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనపై పట్టపగలు కాల్పులు జరిపేంత ధైర్యం ఎవరికి ఉందని ఆ పార్టీల నాయకులు నిలదీస్తున్నారు.
CAA నిరసన ప్రదర్శనలో దారుణం: విద్యార్థులపై కాల్పులు: స్వాతంత్య్రం కావాలా అంటూ బీభత్సం!
శాంతిభద్రతలు అధ్వాన్నంగా..
ఈ కాల్పుల ఘటన వెనుక భారతీయ జనతా పార్టీ నాయకుల హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ సీనియర్ నాయకులు సంజయ్ సింగ్, డీ రాజా ఆరోపించారు. ఈ ఉదంతాన్ని సాకుగా చూపించి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయించడానికి బీజేపీ కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. గవర్నర్ పరిధిలో ఉన్న శాంతిభద్రతలు ఎంత అధ్వాన్నంగా తయారయ్యాయో చెప్పడానికి పట్టపగలు, నడిరోడ్డు మీద చోటు చేసుకున్న ఈ కాల్పుల ఉదంతాన్ని ఉదాహరణగా మారిందని అన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలకు నిదర్శనంగా..
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాల పట్ల నిరసనలు తెలియజేస్తోన్న వారి గుండెల్లో బుల్లెట్లు దించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనను వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే.. ఆయన అనుకున్నదంతా అయిందని సంజయ్ సింగ్, డీ రాజా మండిపడ్డారు. అనురాగ్ ఠాకూర్ అలా చెప్పాడో.. లేదో దాన్ని అమలు చేశారని విమర్శించారు. అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనల తరువాతే ఈ ఘటన చోటు చేసుకుందని, దీనికి బీజేపీ బాధ్యత వహించాలని డీ రాజా డిమాండ్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ వాసిగా..
ఇదిలావుండగా.. జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన నిరసన ప్రదర్శనపై కాల్పులు జరిపిన యువకుడిని రామ్ భగత్ గోపాల్ శర్మగా గుర్తించారు. ఢిల్లీకి ఆనుకునే ఉండే ఉత్తర ప్రదేశ్లోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలోని జెవర్ ప్రాంతానికి చెందిన వాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అతని వయస్సు 19 సంవత్సరాలని తెలిపారు. ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నామని అన్నారు. అతను ఉద్దేశపూరకంగా ఈ కాల్పులు జరిపాడా? లేక ఇంకెవరిదైనా ప్రోద్బలం ఉందా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నామని చెప్పారు.