Haryana Elections: ఆ మూడు వర్గాల మద్దెతవరికి - వారిదే విజయం..!!
హర్యానా ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పోలింగ్ కు సమయం సమీపిస్తోంది. పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. పోలింగ్ లో సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించనున్నాయి. దీంతో..జాట్ తో పాటుగా దళిత, మైనార్టీ ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో, ఎవరి మద్దతెవరికి దక్కుతుంది. ఎవరికి అధికారం దక్కనుందనేది ఉత్కంఠ పెంచుతోంది.
కొత్త లెక్కలు
హర్యానాలో ఎన్నికల పొత్తులతో సామాజిక లెక్కలు మారుతున్నాయి. జాట్ వర్గం నేతల చేతుల్లో ఉన్న ఇండియన్ నేషనల్ లోక్దళ్ , జన్నాయక్ జనతా పార్టీ లు.. జాట్-దళిత కాంబినేషన్తో చెరొక దళిత-బహుజన పార్టీలతో జతకట్టాయి. ఐఎన్ఎల్డీ-బీఎస్పీ జతకట్టగా, జేజేపీ-ఏఎస్పీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధానంగా జాట్-దళిత-మైనారిటీ కాంబినేషన్తో అధికారం దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వేర్వేరు కూటములు జాట్-దళిత ఓట్ల తీసుకొచ్చే చీలిక కాంగ్రెస్ పార్టీకే నష్టం కల్గిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి.

మారుతున్నసమీకరణలు
ఇప్పటికే ఆప్ పోటీలో ఉండటంతో కాంగ్రెస్ ఓట్లకు గండి పడుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని..ఓట్ల చీలిక తమ విజయాన్ని అడ్డుకోలేదని ధీమా వ్యక్తంచేస్తోంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా అనేక మంది హర్యానా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. హామీల వర్షం కురిపిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటినీ గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అటు ఓబీసీ ఓట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. జాట్లు, నాన్ జాట్ వర్గాలుగా చీలిపోవటంతో కొత్త సమీకరణాలను అమలు చేస్తోంది. తాజా లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీకి ఆనుకుని ఉన్న దక్షిణ హర్యానాలోని గురుగ్రాం, ఫరీదాబాద్, భివానీ-మహంద్రగఢ్ లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందింది.
గెలుపు దక్కేదెవరికి
ఈ పార్లమెంట్ స్థానాల పరిథిలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ గణనీయమైన సంఖ్యలో ఉన్న ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది మనోహర్ లాల్ ఖట్టర్ను తప్పించి ఓబీసీ వర్గాల్లో ఆదరణ ఉన్న నేత నయాబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. డేరా బాబా ప్రభావం ఇప్పటికీ ఆ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలపై ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఈ సారి హర్యానాలో గెలుపు పైన భారీ ఆశలతో ఉంది. దీంతో, బీజేపీ - కాంగ్రెస్ లో ఎవరికి అధికారం దక్కుతుందనేది అక్టోబర్ 8న తేలనుంది.












Click it and Unblock the Notifications