సీఏఏని సుప్రీంలో సవాల్ చేసిన కేరళ ప్రభుత్వం.. న్యాయ పోరాటానికి సిద్దమైన మొదటి రాష్ట్రం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ చట్టం రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కులను కాలరాసేదిగా ఉందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన ఏకైక రాష్ట్రం కేరళనే కావడం గమనార్హం. ఈ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసిన ఏకైక రాష్ట్రం కూడా కేరళనే.
సెక్యులరిజానికి వ్యతిరేకమని..
సీఏఏ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21,25లను ఉల్లంఘిస్తోందని,ఇది సెక్యులరిజానికి వ్యతిరేకమని ప్రకటించాలని కేరళ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. సీఏఏ చట్టంతో పాటు పాస్పోర్ట్ యాక్ట్,ఫారినర్స్ యాక్ట్ నిబంధనలను కూడా కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.
ఆర్టికల్ 14,ఆర్టికల్ 21లు ఏం చెబుతున్నాయి..
ఆర్టికల్ 14 అందరికీ సమానత్వ హక్కును ఇవ్వగా, ఆర్టికల్ 21 ప్రకారం చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం ప్రకారం తప్ప.. ఏ వ్యక్తి అతని జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు.
ప్రాథమిక హక్కులన్నింటిని జాతీయ అత్యవసర పరిస్థి తుల్లో రద్దు చేయవచ్చు. కానీ, ఆర్టికల్ 20, 21 మాత్రం రద్దు కావు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కు ఉన్నప్పటికీ.. వాటి స్పూర్తికి భంగం కలిగించరాదన్న నిబంధన కూడా ఉంది.
అసెంబ్లీ తీర్మానం కూడా
ఈ నెలలోనే కేరళ ప్రభుత్వం సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 11మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులకు కేరళ సీఎం పినరయి విజయన్ లేఖలు కూడా రాశారు. సెక్యులరిజాన్ని దెబ్బతీసే ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని లేఖల్లో కోరారు.
ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారు..
సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నవారిలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా కోల్కతాలో ఇప్పటికీ ఆమె ర్యాలీలు చేపడుతూనే ఉన్నారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చట్టాలను వ్యతిరేకించారు. అయితే కేరళ ప్రభుత్వం మాత్రమే సీఏఏని చట్టపరంగా సవాల్ చేస్తోంది.