లాలూ భార్యాకూతుళ్లకు రాజ్యసభ సీట్లు
పాట్నా: బీహార్ లో లాలూ కుటుంబ రాజకీయాలు మొదలైనాయి. లాలు ప్రసాద్ అంటేనే కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇప్పుడు ఇద్దరు కుమారులలో ఒకరు బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, మరో కుమారుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇంట్లో ఉన్న తన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి, కుమార్తె మీసా భారతీని రాజ్య సభకు పంపించాలని నిర్ణయించారు. ఆర్జేడీ నుంచి వీళ్లిద్దరినీ రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయించాలని తీర్మానించారు.
బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఆర్జేడీ 80 స్థానాలు గెలుచుకుంది. రాజ్యసభ్యకు పోటీ చేసే అభ్యర్థికి 41 మంది శాసన సభ్యులు ఓటు వేస్తే చాలు. ఇప్పుడు మిత్రపక్షాలైన జేడీ(యూ), కాంగ్రెస్ లో ఎవరో ఇద్దరు ఓటు వేస్తే రబ్రీదేవి, మీసా భారతీ రాజ్యసభలో అడుగు పెడుతారని ఆర్జేడీ నాయకులు అంటున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన రబ్రీదేవి ఓడిపోయారు. మీసా భారతీ సైతం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వీరిద్దరిని రాజ్యసభకు పంపించాలని లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి.
2016 జులై లో జేడీ(యూ)కు చెందిన ఐదుగురు ఎంపీలు రిటైడ్ కానున్నారు. ఇదే సందర్బంలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో రబ్రీదేవి, మీసా భారతికి రాజ్యసభ సీట్లు ఇవ్వనున్నారు. తాను జాతీయ రాజకీయాలు చూసుకుంటానని, తన సోదరుడు నితీశ్ కుమార్ బీహార్ రాజకీయాలు చూసుకుంటారని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే.