దాడుల కోసం ‘యాప్’ రూపొందించిన లష్కరే తొయిబా
ఉగ్రవాదులు కూడా ప్రస్తుత సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ మద్దతుతో భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తోన్న హఫీజ్ సయీద్, తన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబాకు సొంతంగా ఓ యాప్ను తయారు చేయించారు.
దీని ద్వారా తమ కార్యకలాపాలు నిఘా సంస్థలు కనిపెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు.లష్కర్ ఎ తొయిబాలో ఉన్న 20 మంది సైబర్ సెల్ ఉగ్రవాదులు ఈ యాప్ తయారు చేశారు.
ఈ యాప్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవడం, ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు. జమ్ముకాశ్మీర్లోని ఉధంపూర్లో పట్టుబడిన పాక్ ఉగ్రవాది నవేద్ కూడా ఇదే యాప్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.
నవేద్ అరెస్ట్ అనంతరం ఈ యాప్ గురించి వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ యాప్ ద్వారా లష్కర్ ఎ తొయిబాకు సహకరిస్తున్న వారి వివరాలు ఎన్ఐఏ అధికారులకు తెలిసినట్లు సమాచారం.
ఆ తర్వాతే కాశ్మీర్ లోయలో లష్కర్ ఎ తొయిబా కమాండర్ అబూ ఖాసింకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ యాప్కు సంబంధించిన సర్వర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. దాడులకు ప్రణాళికలు వేసేవారికి, వాటిల్లో పాల్గొనే వారికే ఈ యాప్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు.