రూ.100 కోట్ల ఆరోపణల చిచ్చు: చిక్కుల్లో సంకీర్ణ సర్కార్: ముఖ్యమంత్రికి స్వేచ్ఛ
ముంబై: ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్.. హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్పై చేసిన 100 కోట్ల రూపాయల కలెక్షన్ ఆరోపణలు, ఆయన రాసిన లేఖ..మహారాష్ట్ర రాజకీయాలను అట్టుడికిస్తున్నాయి. సాక్షాత్తూ ఓ పోలీస్ కమిషనరే ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి విచారణ అవసరం లేకుండా, తక్షణమే అనిల్ దేశ్ముఖ్పై చర్యలు తీసుకోవాలని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. భారీ ర్యాలీ నిర్వహించింది. అధికార మహా వికాస్ అగాఢీ కూటమి భాగస్వామ్య పక్షం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే డిమాండ్ను వినిపిస్తోంది.
అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలా? లేదా? అనేది ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తేల్చుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన ఆరోపణల ప్రభావం.. సంకీర్ణ కూటమిపై ఉండబోదని తేల్చేశారు. అనిల్ దేశ్ముఖ్ నుంచి రాజీనామా కోరడాన్ని ఓ ఆప్షన్గా మాత్రమే తాము భావిస్తున్నామని చెప్పారు. రాజీనామా విషయంలో తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది ముఖ్యమంత్రేనని చెప్పారు. అనిల్ దేశ్ముఖ్ రాజీనామాకు ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే దాన్ని కూడా పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
పరమ్బీర్ సింగ్ తనను కలిశారని శరద్ పవార్ పేర్కొన్నారు. ఆయన బదిలీ వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చని అన్నారు. ఈ విషయంపై తాను ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడానని, ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని సూచించినట్లు చెప్పారు. పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై మాజీ ఐపీఎస్ అధికారి జూలియో రిబేరో సూచనలను తీసుకోవాలని తాను ఉద్ధవ్ థాకరేకు సూచించానని అన్నారు. మరోవంక- శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ఏర్పాటు కావడానికి ఆయనే కారణమని, అందుకే ప్రభుత్వం పట్ల మెతక వైఖరితో ఉన్నారని చెప్పారు.