పెరిగి విరిగిన భండారీ: వాద్రాతో సంబంధమేంటి?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందినట్లుగా భావిస్తున్న ఇంటిని కొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఆర్థిక వ్యవహారాలపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి రాజకీయ నేతలతో సత్సంబంధాలు కొనసాగుతన్న భండారీ.. తన కాంట్రాక్టులను సజావుగా సాగించుకుంటున్నారు.
ఇండియన్ ఎయిర్ఫోర్స్తో ఒప్పందాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు రావడంతో 2010లో భండారీ బాగోతం తొలిసారి వెలుగుచూసింది. 2008లో ప్రారంభమైన ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్(ఓఐఎస్) సంస్థకు భండారీనే ప్రధాన ప్రమోటర్. కాగా, ఈ సంస్థ 30శాతం విదేశీ పెట్టుబడులతో భారత దేశీయ ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టింది.
భండారీతో రాబర్ట్ వాద్రాకి సన్నిహిత సంబంధాలున్నట్లు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులను, భండారీ సహచరులు ఓ జాతీయ మీడియా సంస్థ(ఈటీ)కు తెలిపినట్లు సమాచారం. దుబాయ్, విదేశాల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు భండారీ.. వాద్రా సహకారం తీసుకునే వారని తెలిసింది. తరచుగా లోధి రోడ్డులోని ఓ లగ్జరీ హోటల్లో భండారీ, వాద్రాలు కలుసుకునేవారని వారు చెప్పారు.

డిఫెన్స్కు సంబంధించిన పలు కీలక విషయాలు కూడా భండారీకి తెలుసునని తెలుస్తోంది. ఓఐఎస్ సంస్థతో భండారీ ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ వ్యాపారాన్ని నిర్వహించారు. కాగా, మనదేశంలో ఎలాంటి పెద్ద కాంట్రాక్టులు లేని సంస్థకు డిఫెన్స్తో ఒప్పందాలు ఎలా దక్కాయోనని పలువురు పారిశ్రామికవేత్తలు
ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాగా, రాబర్ట్ వాద్రా పేరిట లండన్లో బినామీ పద్ధతిలో ఓ భవంతిని ఖరీదు చేశాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్టు ఓ జాతీయా మీడియా సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన రెండు ప్రాథమిక దర్యాప్తు నివేదికలను ఆ ఛానెల్ సేకరించింది. వాద్రాతో పాటు ఆయన సహాయకుడు మనోజ్ అరోరా ఆయుధాల డీలర్ భండారీ సన్నిహితుల మధ్య నడిచిన ఈమెయిల్స్లో ఉత్తరప్రత్యుత్తరాలపై దర్యాప్తు సంస్థలు పరిశోధన జరుపుతున్నాయి.
ఎన్ఫోర్స్మెంట్, పన్ను విభాగాల నివేదికలను ఆర్థికశాఖ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అయితే లండన్ భవంతి ఖరీదు వ్యవహారానికి, వాద్రాకు ఎలాంటి సంబంధం లేదని వాద్రా తరఫు న్యాయవాదులు ఖండిస్తున్నారు.
మే నెలలో భండారీకి చెందిన 18 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు దాడులు జరిపాయి. లండన్లోని 12 ఎలెర్టన్హౌజ్, బ్రయాన్స్టన్ స్కేర్ చిరునామాలోగల భవంతిని 2009లో 19 లక్షల పౌండ్లకు (సుమారు 19 కోట్లు) కొనుగోలు చేయడం, 2010లో అమ్మివేయడానికి సంబంధించిన వివరాలు ఈమెయిల్స్ పరిశీలనలో వెల్లడయ్యాయని అంటున్నారు.
సదరు భవంతి మరమ్మతులు, అందుకు జరుపాల్సిన చెల్లింపుల గురించి భండారీ బంధువు సుమిత్ చడ్డాకు, వాద్రాకు, అరోరాకు మధ్య ఈమెయిల్స్ నడిచాయని తెలుస్తోంది. 2010 ఏప్రిల్ 4న సుమిత్ చడ్డా ఆ భవంతి మరమ్మత్తులపై వివరిస్తూ చెల్లింపుల గురించి ప్రస్తావించారని ఒక నివేదికలో ఉంది.
ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తానని, తన సెక్రటరీ మనోజ్ టచ్లో ఉంటారని వాద్రా ఆ మెయిల్కు జవాబిచ్చారు. తర్వాత మనోజ్ ఎగ్జిమ్ రియల్ ఎస్టేట్ అనే ఐడీ నుంచి మెయిల్ పంపారు. భవంతికి మెరుగులు దిద్దడం, కొత్త షాండ్లీర్స్ ఏర్పాటు చేయడం గురించి ఈమెయిల్స్లో ఉన్నట్టు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని అధికారులు ఎన్డీటీవీకి చెప్పారు.
సంజయ్ భండారీని దర్యాప్తు సంస్థలు ప్రత్యేకించి వాద్రాకు లండన్ భవంతితో గల సంబంధం గురించి అడిగితే ఆయన నేరుగా సమాధానం దాటవేశాడని, సేల్డీడ్ చూసిచెప్తానని అన్నారని తెలిసింది.
కాగా, భండారీని ప్రశ్నించి, ఈ-మెయిల్స్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఐటి అధికారులు వివిధ దేశాలకు లేఖలు రాశారు. ఈ డీల్లో భండారీ పాత్రపై వివరాలు సమర్పించాలని వారు కోరారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ సంస్థ కార్యకలాపాలపై నిఘా వేసి దీనిని దూరంగా ఉంచాలని రక్షణ శాఖను హెచ్చరించింది.












Click it and Unblock the Notifications