అధికార, ప్రతిపక్ష పార్టీల హెల్ప్ లైన్ వార్, ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదని ?
బెంగళూరు: నెల రోజుల క్రితం వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండేది. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చుక్కలు చూపించిన కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో అధికారంలోకి వస్తామని ఆశపడిన బీజేపీ నాయకుల ఆశలు గల్లంతు అయ్యాయి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రతీకార రాజకీయాలకు తెరలేపుతుందని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి ఆ పార్టీ నాయకులు వారం రోజుల్లోపు ప్రత్యేకమైన హెల్ప్ లైన్ ప్రారంభిస్తామని ప్రకటించారు.

బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పార్టీ హెల్ప్ లైన్ కు ఫోన్ చెయ్యాలని, మీకు మేము అండగా ఉంటామని బీజేపీ నాయకులు ధైర్యం చెబుతున్నారు. అయితే పుష్కలంగా సంపూర్ణ మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఐదు సంవత్సరాలు కర్ణాటకలో మేమే అధికారంలో ఉంటామని, మాదే రాజ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ హెల్ప్ లైన్ ప్రారంభిస్తున్న సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కూడా హెల్ప్ లైన్ ప్రారంభించడానికి సిద్దం అవుతోందని తెలుస్తోంది. కర్ణాటక పరిశ్రమల శాఖా మంత్రి ఎంబీ పాటిల్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్, హోమ్ శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి ప్రియాంక ఖార్గేలను ట్యాగ్ చేస్తూ పరిశ్రమల శాఖా మంత్రి ఎంబీ, పాటిల్ ట్వీట్ చేశారు.

మనం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్షణ కోసం హెల్ప్ లైన్ ప్రారంభించడానికి మీరు చర్యలు తీసుకోవాలని ఎంబీ. పాటిల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో బీజేపీ కార్యకర్తల మీద దాడులు ఎక్కువగా జరుగుతాయని గత వారం బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యా ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇటీవల బీజేపీ మాజీ మంత్రి కోట శ్రీనివాస పూజారిని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరించారు. ఇలాంటి సమయంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ హెల్ప్ లైన్ లు ప్రారంభించడం హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ ప్రారంభిస్తున్న హెల్ప్ లైన్ ప్రతిరోజు 24 గంటలు పని చేస్తోందని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications