జనతా పరివార్ కు గుడ్ బై చెప్పిన ములాయం
లక్నో: ఎన్ డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోనేందుకు ఏర్పాటైన జనతా పరివార్ కూటమికి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. ఈ దెబ్బతో కాంగ్రెస్ తో పాటు ఆర్ జేడీ, జేడీ (యూ) నాయకులు ఉలిక్కిపడ్డారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్ డీఏ సర్కార్ ను ఎదుర్కునేందుకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జనతా పరివార్ కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో ములాయం సింగ్ యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
అయితే జనతా పరివార్ కూటమి నుండి ఆయన తప్పుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. జనతా పరివార్ సమాజ్ వాదీ పార్టీకి తక్కువ సీట్లు కేటాయించడం వలనే ములాయం సింగ్ యాదవ్ తప్పుకున్నారని తెలిసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 50 మందికి పైగా డమ్మి అభ్యర్థులను నిలబెట్టాలని ఎస్ పీ నిర్ణయించిందని తెలిసింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆర్ జేడీ, జేడీ (యూ) ఏర్పాటు చేసిన జనతా పరివార్ కూటమికి ములాయం సింగ్ యాదవ్ రానురాను దూరం అవుతున్నారు.
ఇదే జరిగితే బీహార్ ఎన్నికలలో బీజేపీకి లాభం చేకూరుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో బేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీతో ములాయం సింగ్ యాదవ్ భేటీ అయిన రెండు రోజుల తరువాత ఆయన జనతా పరివార్ కూటమి నుండి బయటకు రావడం కొసమెరుపు. ఆదివారం పాట్నాలో జనతా పరివార్ కూటమి నిర్వహించిన ర్యాలీలోనూ ములాయం సింగ్ యాదవ్ పాల్గోనలేదు.