జయలలిత లేరు: ఐటీ దాడుల కలకలం, బెంగళూరు టూ చెన్నై
తమిళనాడులో ఒక్క సారిగా ఐటీ అధికారులు విరుచుకుపడటంతో అన్నాడీఎంకే నాయకులతో పాటు ప్రభుత్వంలోని అవినీతి అధికారులు హడలిపోతున్నారు. ఇంకా ఎంతమంది అధికారులు ఐటీ అధికారుల దాడిలో పట్టుబడుతారు ?
చెన్నై/బెంగళూరు: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు వివేక్ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం రోజూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగడంతో ప్రభుత్వ అధికారులు హడలిపోతున్నారు.
తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు వివేక్ ఇంటితో పాటు వీరి బంధువుల ఇంటిలో ఇప్పటి వరకు ఎంత మొత్తంలో నగదు, బంగారం, విలువైన అక్రమ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అనే విషయం ఐటీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.
తమిళనాడు సీనియర్ మంత్రి ఎడప్పాడి పళనిస్వామి బంధువు రామలింగం కర్ణాటకలో ఐటీ అధికారుల వలలో పడ్డారు. కర్ణాటకలో మంత్రి బంధువు రామలింగం ఐటీ అధికారుల చేతికి చిక్కిన తరువాత ఐటీ అధికారులు తమిళనాడులో తనిఖీలు ముమ్మరం చేశారు.
షాక్: పన్నీర్, శశికళ వర్గీయుల ఎత్తులు పై ఎత్తులు ? ఫలితంగా ఐటీ దాడులు !
ఇవి మొత్తం గొలుసుకట్టు పరిణామాలేనని అధికారుల దర్యాప్తులో తెలిసింది. రామలింగం ఇచ్చిన సమాచారం మేరకు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి, ఆయన బంధువులు ప్రేమ్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి తదితరులు ఐటీ అధికారుల వలలో పడ్డారు.
శేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఐటీ అధికారులు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావును టార్గెట్ చేసుకుని దాడులు చేశారు. రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు వివేక్ తో పాటు వారి బంధువుల నివాసాల్లో గురువారం రోజూ తనిఖీలు చేస్తున్నారు.
కర్ణాటక, తమిళనాడు తరువాత ఐటీ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, విజయవాడలో తనిఖీలు చేశారు. రామ్మోహన్ రావు వియ్యంకుడు, చిత్తూరు శాసన సభ్యురాలు (టీడీపీ) సత్యప్రభ మరిది, దివంగత డీకే. ఆదికేశవులు నాయుడు సోదరుడు బద్రీనారాయణ నివాసంలో తనిఖీలు చేశారు.
జయలలిత అండ చూసుకుని రూ. 10 వేల కోట్ల వ్యాపారం !
మొత్తం మీద తమిళనాడులోని అవినీతి తిమింగలాలను టార్గెట్ చేసుకుని పక్కన ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు, బంధువుల నివాసాల్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రామ్మోన్ రావు, ఆయన కుమారుడు వివేక్ తదితరుల నివాసాల్లో రూ. 17 నుంచి రూ. 18 కోట్ల వరకు వెల్లడించని ఆదాయం పట్టుబడిదందని, అదే విధంగా రూ. 48 లక్షల కొత్త నోట్లు, 7 కేజీల బంగారం లభించిందని స్థానిక మీడియా సంస్థ తెలిపింది.