పాక్ ఉగ్రవాదులు బరి తెగించారు: దాడులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించడానికి పెద్ద ప్లాన్ వేశారని వెలుగు చూసింది. భారీ ఆయుధాలతో దాడులు నిర్వహించడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోందని ఆర్మీ వర్గాలు అంటున్నాయి.
బుధవారం ఉదయం 7. 30 గంటల సమయంలో భారీగా ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు తాంఘ్ధార్ సెక్టార్ సమీపంలోని ఆర్మీ క్యాంపు దగ్గరకు చేరుకున్నారు. ఒక్క సారిగా భారత్ జవాన్ల మీద గ్రనేడ్లు విసిరి కాల్పులకు తెగబడ్డారు.
క్షణాలలో తేరుకున్న భారత్ జవాన్లు సైతం ఉగ్రవాదుల మీద ఎదురుకాల్పులు జరిపారు. ఆ సందర్బంలో భారత్ ఆర్మీకి చెందిన ఆయిల్ డిపో మంటల్లో చిక్కుకునింది. ఉగ్రవాదులు దాడులకు దిగిన విధానాన్ని బట్టి భారీ విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ వేశారని అధికారులు తెలిపారు.
ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు అన్నారు. మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో కొందరు ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించారు.
మంగళవారం అర్దరాత్రి జరిపిన గాలింపు చర్యల్లో భారత్ జవాన్లు ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఏకే-47, 113 రౌండ్ లకు సరిపోయే బుల్లెట్లు, పికా మందుగుండు, రెండు ఐఈడీలు, ఓ చైనా గ్రనేడ్, పాకిస్థాన్ సిమ్ కార్డులు, కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
జవాన్లు గాలిస్తున్నారని పసిగట్టిన ఉగ్రవాదులు ఈ వస్తులు అక్కడే వదిలి పెట్టి పారిపోయారని ఆర్మీ అధికారులు అంటున్నారు. ఉగ్రవాదులు భారత్ లోకి చోరబడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.