పంజాబ్ లో పోలింగ్ కు సిద్దం : 117 సీట్లు- 1,304 మంది అభ్యర్ధులు : నువ్వా నేనా..!!
ఎన్నికలు జరుగుతునున్న అయిదు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ పంజాబ్ పైన ఉంది. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ చివరి ఆరు నెలల కాలంలో చేసిన రాజకీయ ప్రయోగాలు తిరిగి అధికారం నిలబెట్టుకోవటానికి సహకరిస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. ఆప్ కింగ్ అవుతుందా.. కింగ్ మేకర్ గా మారుతుందా అనేది మరో చర్చ. కెప్టెన్ తో బీజేపీకి ఎంత వరకు కలిసి వస్తుంది.. శిరోమణి అకాలీ దళ్ ఓట్లు..సీట్లు ఎవరికి మేలు చేస్తాయి..ఇటువంటి ఆసక్తి కర అంశాల నడుమ రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
117 స్థానాలకు 1,304 మంది పోటీ
రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాల్లో 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీని ఎన్నికల సంఘం గతంలో వాయిదా వేసింది. రాష్ట్రంలో 93 మంది మహిళలు సహా మొత్తం 1,304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో ఎస్ఏడీ-బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది.
ఆప్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు
ఈసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. ఈ ఎన్నికల్లో రాజకీయంగా ప్రముఖలు పోటీ చేస్తున్న స్థానాల పైన ఆసక్తి నెలకొని ఉంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (అమృత్సర్), ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ (ధురి), ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ (భదౌర్, చమ్కౌర్ సాహిబ్) శిరోమణీ అకాళీ దల్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ (జలాలబాద), కెప్టెన్ అమరీందర్ సింగ్ (పాటియాలా), ప్రకాశ్ సింగ్ బాదల్ (లంబి), సుఖ్పాల్ ఖైర్ (భోలుత్), కుల్వంత్ సింగ్ (మొహాలీ) నుంచి పోటీ చేస్తున్నారు.
ముక్కోణపు పోటీలో పార్టీల ధీమా
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్ దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని ఎస్ఎడి (సంయుక్త్)తో పొత్తు పెట్టుకుని బిజెపి తో కలిసి పోటీ చేస్తోంది. ఇక, రాష్ట్రంలోని యువతను ఆకట్టుకొనేందుకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్లు కల్పిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు జరిగే ఎన్నికల పైన అన్ని పార్టీలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల మాత్రం పోలింగ్ ఏ విధంగా ఉంటుందనే అంచనాలు..సందేహాల నడుమ చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.