పోయెస్ గార్డెన్ లో శశికళకు 4 గదులు, అదే సెంటిమెంట్ తో బెంగళూరు సెంట్రల్ జైల్లో 4 గదులు !
జయలలిత వేదనిలయంలో శశికళకు నాలుగు గదులుపోయెస్ గార్డెన్ సెంటిమెంట్ తో సెంట్రల్ జైల్లో నాలుగు గదులుచిన్నమ్మ ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు పరిశీలిస్తున్న ఐటీ శాఖ అధికారులు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో చిన్నమ్మ శశికళ నాలుగు గదులు ఉపయోగించేవారని వెలుగు చూసింది. ఆదాయపన్ను శాఖ అధికారులు పోయెస్ గార్డెన్ లో సోదాలు చేసిన తరువాత ఒక్కొక్క విషయం బయటకు వస్తోంది.
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో నాలుగు గదులు ఉపయోగించిన వీకే శశికళ నటారాజన్ అదే సెంటిమెంట్ తో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో నాలుగు గదులు కేటాయించాలని జైళ్ల శాఖ అధికారులతో లాభీ అయ్యారని ఆరోపణలు ఉన్నాయి.
అందుకోసమే బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళకు నాలుగు గదులు కేటాయించారని తెలిసింది. బుధవారం లేదా గురువారం చెన్నై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పత్రాలు తీసుకుని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని శశికళను విచారణ చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది.
పోయెస్ గార్డెన్ లోని శశికళ గదుల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ ల్లో ఏముంది అనే విషయాన్ని సాఫ్ట్ వేర్ నిపుణులతో ఐటీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. శశికళ అక్రమాస్తులకు సంబంధించి పూర్తి సమాచారం అందులో ఉంటుందని ఆదాయపన్ను శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.