మోడీ భవితవ్యం: కేంద్రంలో అధికారం చేపట్టేది ఎవరో నిర్ణయించేది ఈ 59 స్థానాలే..!
భారతదేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే 483 స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఇక చివరి దశ పోలింగ్ మే 19న జరుగనుంది. ఇక చివరి దశ ఎన్నికలు ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్లకు కీలకంగా మారనున్నాయి. ఇక చివరి దశలో 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ 59 స్థానాలే కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో నిర్ణయించే అవకాశం ఉంది. ఉత్తర్ ప్రదేశ్లో 13 స్థానాలు, పంజాబ్లో 13 స్థానాలు వెస్ట్ బెంగాల్లో 9 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు మధ్యప్రదేశ్లో 8 స్థానాలు హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు, జార్ఖండ్లో 3 స్థానాలు, చండీగఢ్లో ఒక స్థానంలో పోలింగ్ జరుగనుంది.
2014లో మోడీ మేనియా... ఆతర్వాత మారిన సమీకరణాలు
2014లో జరిగిన ఎన్నికల్లో నాటి మోడీ మేనియాతో ఉత్తరభారతం, పశ్చిమ భారతంలో కలిపి 33 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ ఒంటరిగానే 282 స్థానాల్లో విజయం సాధించింది. ఇక పొత్తులతో ఈ 59 స్థానాల్లో 40 స్థానాలను బీజేపీ విజయం సాధించింది. ఇక టీఎంసీకి 9 స్థానాలు, కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి నాలుగు, కాంగ్రెస్కు మూడు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి రెండు , జనతాదల్ యునైటెడ్కు ఒక్క స్థానం దక్కాయి.
2014 నుంచి రాజకీయంగా సమీకరణాలు క్రమంగా మారుతూ వచ్చాయి. పంజాబ్లో శిరోమణి అకాలీదల్తో జతకట్టిన బీజేపీ అధికారంలో ఉండగా... 2017లో అక్కడ కాంగ్రెస్ పాగా వేసింది.ఇక మధ్యప్రదేశ్లో దాదాపు 15 ఏళ్ల తర్వాత బీజేపీ ఓటమిపాలైంది. అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014 పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో కమలం పార్టీ వికసించింది. ఇక బీహార్లో జేడీయూ ఆర్జేడీల మధ్య మైత్రి తెగిపోవడంతో బీజేపీ సహకారంతో జేడీయూ అధికారంలో ఉంది. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై కాస్త వ్యతిరేకత ఉంది. ఇదే బీజేపీ కొంప ముంచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆ వ్యతిరేకత లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపిస్తే ఇక కాషాయం పార్టీకి కష్టాలు తప్పవు.
ఎస్పీ -బీఎస్పీ కలయికతో యూపీలో బీజేపీకి కష్టకాలమే
ఉత్తర్ ప్రదేశ్లో ఇప్పుడు మొత్తం 13 స్థానాలకు చివరి దశలో పోలింగ్ జరుగనుంది. అయితే 2014లో ఈ 13 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. అయితే అప్పటి ఈక్వేషన్స్ వేరు. ఇప్పుడు సమాజ్ వాదీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో బీజేపీకి ఇది ప్రాణసంకటంగా మారింది. ఇప్పటికే గోరఖ్పూర్, ఫూల్పూర్ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ కూటమి విజయకేతనం ఎగురవేసింది. గోరఖ్పూర్ ఫూల్ పూర్ స్థానాలు స్వయంగా ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యాలది కావడం విశేషం.
బీహార్లో బంతి ఎవరి కోర్టులో..?
ఇక బీహార్లో కూడా బీజేపీకి కాస్త కష్టంగానే కనిపిస్తోంది. 2014లో రాష్ట్రీయలోక్సమతా పార్టీతో కలిసి పోటీచేసింది బీజేపీ. ఉపేంద్ర కుష్వాహాకు కేంద్రమంత్రి పదవి కూడా కట్టబెట్టింది. కానీ ఈసారి ఆయన విపక్షాలతో చేయి కలిపారు. ప్రస్తుతం చివరి దశలో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఇందులో ఏడు స్థానాలు ఎన్డీయే 2014లో గెలుచుకుంది. ఇక 2014లో శతృఘ్నసిన్హా పోటీ చేసి గెలవగా ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. శతృఘ్నసిన్హాపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో ఉన్నారు.
మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం కనిపిస్తే కష్టమే
మధ్యప్రదేశ్లో చివరిదశలో మొత్తం 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ 8 స్తానాల్లో 2014లో బీజేపీ విజయం సాధించింది. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాల్వా - నిమార్ ప్రాంతంలో బీజేపీ 66 సీట్లకు గాను 56 సీట్లు కైవసం చేసుకుంది. అదే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే ఇదే మూడ్తో ప్రజలు ఓటింగ్ చేస్తే బీజేపీ గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది.
బెంగాల్పై బీజేపీ పట్టు సాధిస్తుందా..?
పశ్చిమ బెంగాల్లో 42 స్థానాలు ఉండగా బీజేపీ 21 స్థానాలపై కన్నేసింది. అందుకే బెంగాల్లో పట్టువీడకుండా ప్రచారం చేసింది బీజేపీ. ఇక పంజాబ్ చండీగఢ్లలో మొత్తం 13 స్థానాల్లో ఒకేసారి పోలింగ్ జరుగనుంది. 2014లో ఎన్డీఏ 6 స్థానాలను నెగ్గింది. ఆ సమయంలో ఎన్డీఏ ఆరాష్ట్రంలో అధికారంలో ఉన్నింది. ఇక హిమాచల్ ప్రదేశ్లో 2014లో బీజేపీ మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నింది. ఇక జార్ఖండ్ విషయానికొస్తే చివరి దశలో మూడు స్థానాలు జరుగుతుండగా అందులో ఒక స్థానంను 2014లో బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నందున అక్కడ మరింత పట్టు సాధించాలని భావిస్తోంది.