సర్జికల్ స్ట్రైక్స్ 2: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్లో దాడి చేసింది ఈ మూడు ప్రాంతాల్లోనే
ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మొహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషేమొహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో దాడులు చేసిన భారత వాయుసేన దాదాపు 300 మందిని మట్టుబెట్టింది. దాదాపు 21 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ను నిర్వహించింది. తెల్లవారు జామున 3 గంటల 45 నిమిషాలకు ఈ దాడులు ప్రారంభించిన భారత వాయుసేన ఉదయం 4 గంటల 6 నిమిషాలకు ముగించి భారత భూభాగంలోకి క్షేమంగా తిరిగి వచ్చింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధానిగా పిలవబడుతున్న బాలాకోట్ ప్రాంతం ముజఫరాబాదుకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా 3గంటల45 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల మధ్య జరిగిన వైమానిక దాడుల్లో ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రాంతంలోని బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ ప్రాంతంలో జరిగిన దాడుల్లో జైషేమోహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్ణణా శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ మూడు శిబిరాలు బాలాకోట్లో ఉన్నాయి. దాడులను గుర్తించిన ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు కానీ శిక్షణా క్యాంపులను వదిలి వెళ్లలేదని సమాచారం. ఇక్కడే ఉగ్రవాదుల ఆయుధాలు ఉంటాయని విశ్వసనీయవర్గాల సమాచారం.
ఇక 3 గంటల48 నిమిషాల నుంచి 3గంటల 55 నిమిషాల మధ్య ముజఫరాబాద్ లక్ష్యంగా భారత వాయుసేన దాడులు జరిపింది. ఇక చివరిగా చకోటి ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసింది. 3 గంటల 58 నిమిషాల నుంచి 4 గంటల 4 నిమిషాల మధ్య ఆపరేషన్ను పూర్తి చేసింది.
ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రమూకలు జరిపిన దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు భారత వాయుసేన అధికారులు తెలిపారు. మరిన్ని దాడులు చేస్తామని వారు స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్పై భారత్ దాడులు చేసిందని నిర్ధారిస్తూ ట్వీట్ చేశారు పాక్ డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్. భారత్ సరిహద్దు దాటి పాక్లో ప్రవేశించి దాడులకు పాల్పడిందని ఆయన ట్వీట్ చేశారు.