కిరణ్ రెడ్డి, జయ, కేజ్రీలకు చేదు, మోడీకి తీపి గుర్తు
న్యూఢిల్లీ: 2014 ఎన్నికలు దేశంలోని పలువురు మాజీ ముఖ్యమంత్రులకు చేదు, తీపి అనుభవాలను మిగిల్చింది. మహామహులైన మాజీ సీఎంలకు పలువురికి ఈ ఏడాది చేదును మిగిల్చింది. వారు మరిచిపోలేని, మరిచిపోయే ఏడాదిగా ఉంటుందని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ (సమైక్యాంధ్రప్రదేశ్) రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు మాజీ సీఎం జయలలిత, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
అదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదమూడేళ్ల పాటు ఉండి.. ఇప్పుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీకి 2014 తీపి గురుతులను మిగిల్చింది. ఇటీవల ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచినప్పటికీ.. దానిని స్థానిక అంశాలను కారణాలుగా చెబుతున్నారు.
అరవింద్ కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్.. మొన్నటి వరకు ఓ కెరటం. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ కూడా కనిపించకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ అంటూ వచ్చిన కేజ్రీవాల్కు ఢిల్లీ ప్రజలు పట్టం గట్టారు! ఆయన పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోయినప్పటికీ.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా సీట్లను గెలుచుకుంది. బీజేపీ మొదటి స్థానంలో, ఏఏపీ రెండే స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్తో కలిసి సీఎం పీఠాన్ని అధిరోహించిన కేజ్రీవాల్ పలు కారణాలతో 49 రోజులకే రాజీనామా చేశారు. దీనిని చాలామంది తప్పుపట్టారు. ఈ రాజీనామాతో కేజ్రీవాల్ అనే కెరటం కిందకు పడిపోయింది. రాజీనామా చేయడం తప్పయిపోయిందని ఆ పార్టీ కూడా అంగీకరించింది.
నితీష్ కుమార్
జేడీ(యు) ముఖ్య నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు 2014 ఎన్నికలు చేదును మిగిల్చాయి. అయితే, ఇటీవల ఉప ఎన్నికలు ఆయనకు కొంత ఊరటనిచ్చాయి. మొన్నటి వరకు జేడీయూ ఎన్డీయేలో ఉంది. ప్రధాని పీఠం పైన మోడీతో పాటు నితీష్ కూడా ఆశలు పెట్టుకున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో జేడీయు బయటకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లో కూడా మోడీ హవా కనిపించింది. నితీష్కు, జేడీయుకు ఆ రాష్ట్ర ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. కోలుకోలేని దెబ్బతిన్న జేడీయు/నితీష్ తప్పనిసరి పరిస్థితుల్లో.. మోడీని ఎదుర్కొనేందుకు తన చిరకాల ప్రత్యర్థి లాలూతో చేయి కలిపారు.
కిరణ్ కుమార్ రెడ్డి
సమైక్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజనను కారణంగా చూపి అధిష్టానాన్ని వ్యతిరేకించారు. తాను అధిష్టానం వల్లనే ఈ స్థాయికి వచ్చానని చెప్పిన కిరణ్.. విభజనను జీర్ణించుకోలేనని చెప్పారు. చివరి నిమిషం వరకు సీఎంగా ఉన్న కిరణ్.. ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా చతికిల పడింది. ఇప్పుడు ఆయన ఊసే లేకుండా పోయింది!
నరేంద్ర మోడీ
చాలామంది ముఖ్యమంత్రిలకు 2014 ఎన్నికలు చేదును మిగిల్చగా.. నరేంద్ర మోడీకి మాత్రం అత్యంత సంతోషాన్ని మిగిల్చాయి. గుజరాత్ నమూనా అభివృద్ధి పేరుతో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా వచ్చిన మోడీ కారణంగానే... దేశంలో ముప్పై ఏళ్ల తర్వాత ఓ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుందని చెప్పవచ్చు. మోడీ, బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.
జయలలిత
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సార్వత్రిక ఎన్నికలు సంతోషాన్ని మిగిల్చాయి. మోడీ హవాను తట్టుకొని దేశంలో నిలబడిన మూడు నాలుగు పార్టీలలో అన్నాడీఎంకే ఒకటి. అదే సమయంలో అమ్మ పథకాలతో జయలలిత దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో ఆమెను పద్దెనిమిదేళ్ల నాటి ఆస్తుల కేసు జైలుకు పంపించింది.
పృథ్వీరాజ్ చౌహాన్
అక్టోబర్ నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో 15 ఏళ్లపాటు మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీ షాకిచ్చింది. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ రాజీనామా చేశారు. ఎన్సీపీ వేరు పడటంతో.. శివసేన, బీజేపీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నప్పటికీ ఆ పార్టీలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశముందని అంటున్నారు.