టార్గెట్ 2024: శరద్ పవార్ నివాసంలో టీఎంసీ, ఆప్ తోపాటు 8 పార్టీల నేతల కీలక భేటీ
న్యూఢిల్లీ: దేశంలో థర్డ్ ఫ్రంట్ ఊహాగానాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో మంగళవారం పలు కీలక పార్టీల నేతలు భేటీ అయ్యారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి చెందిన నేతలు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలోపాటు 8 పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని రాష్ట్ర మంచ్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. అయితే, యశ్వంత్ సిన్హా ఈ కీలక సమావేశాన్ని శరద్ పవార్ నేతృత్వంలో నిర్వహించాలని కోరిన నేపథ్యంలో పవార్ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. ప్రస్తుత దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి చెందిన నేతలు మజీద్ మెమన్, వందనా చౌహాన్, సమాజ్వాదీ పార్టీకి చెందిన గణశ్యామ్ తివారీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుశీల్ గుప్తాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితోపాటు రిటైర్డ్ జస్టిస్ ఏపీ షా, మాజీ రాయబారి కేసీ సింగ్, గేయ రచయిత జావేద్ అక్తర్లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి, మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ ఎస్వై ఖురేషీ, సీనియర్ లాయర్ కులిన్ గోన్సాల్వ్స్ ఈ భేటీకి గైర్హాజరయ్యారు. దేశంలో సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా ఉన్న శరద్ పవార్.. 2024 జాతీయ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని తయారు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.
తాజా భేటీలో ఇదే ప్రధాన అంశంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శరద్ పవార్తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను పిలవకుండానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.