కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్... దేశంలో నేటి నుంచి మూడో విడత... తెలుసుకోవాల్సిన విషయాలివే...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురువారం(ఏప్రిల్ 1) నుంచి ప్రారంభం కానుంది. మూడో దశలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియపై బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ ఆర్ఎస్ శర్మ, కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆదేశాలు జారీ చేశారు.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి...
ఈ ఏడాది జనవరిలో దేశంలో మొదటి దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి విడతలో హెల్త్కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్స్కు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇస్తున్నారు. తాజాగా మూడో దశలో 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేనివారికి కూడా టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లవచ్చు. లేదా కోవిన్ పోర్టల్లో రిజస్టర్ చేసుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు,క్లినిక్స్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక డోసుకు రూ.250 చార్జి చేస్తారు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు...
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. ఆధార్,డ్రైవింగ్ లైసెన్స్,నరేగా గ్యారెంటీ కార్డు,నరేగా జాబ్ కార్డ్,పాన్ కార్డు,బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్ బుక్,పెన్షన్ డాక్యుమెంట్,సర్వీస్ ఐడెంటిటీ కార్డు,ఓటర్ ఐడీ కార్డు... ఇలా ఏ కార్డు చూపించైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు అవసరం లేదు. అయితే కొంతమందిలో నీరసం,ఫీవర్,వాంతులు,కీళ్ల నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. ఒకటి,రెండు రోజుల్లోనే ఇవి తగ్గిపోతాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు.
ఇప్పటివరకూ ఎంతమందికి వ్యాక్సిన్...
దేశంలో ఇప్పటివరకూ 6.30కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో మొదటి డోసు తీసుకున్న హెల్త్ వర్కర్స్ 82,16,239, రెండో డోసు తీసుకున్న హెల్త్ వర్కర్స్ 52,19,525,మొదటి డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ 90,48,417,రెండో డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ 37,90,467 మంది ఉన్నారు. వీరు కాకుండా 45 ఏళ్లు పైబడి ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిలో 73,52,957 మంది మొదటి డోసు,6,824 మంది రెండో డోసు తీసుకున్నారు.వ్యాక్సినేషన్ కోసం కోవిషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కొవిషీల్డ్ టీకా వినియోగ గడువును కేంద్రం 9 నెలలకు పొడగించింది. ఇంతకుముందు ఇది 6 నెలలుగా మాత్రమే ఉంది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నిర్ణయం తీసుకున్నది.