దేశభక్తి అంటే ఏమిటో ఈ వ్యక్తిని చూస్తే అర్థమవుతుంది
దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే వారిని చూశాం. దేశభక్తి నిలువెల్లా ఉన్న వారిని చూశాం. కానీ ఇదిగో ఈ ఫోటోలో వ్యక్తి తనకున్న దేశ భక్తిని మరో స్టేజ్కు తీసుకెళ్లాడు. ఎలా అంటారా... అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
శరీరమంతా పచ్చబొట్లే..!
ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అభిషేక్ గౌతమ్. ఈయన వయస్సు 30 ఏళ్లు. నివాసం ఉంటున్నది ఢిల్లీలో. ఇంతకీ ఈయన గురించి ప్రత్యేకత ఏమిటంటారా... అక్కడికే వస్తున్నాం. ఈయనకు మన దేశం అంటే చాలా ఇష్టం. అపారమైన భక్తి ఉంది. దేశం గురించి ఎవరైనా ఘాటు విమర్శలు చేస్తే తన రక్తం సలసల కాగిపోతుంది. వెంటనే వారితో గొడవ పెట్టుకుంటాడు. అలాంటి వ్యక్తిత్వం అభిషేక్ది. ఇక తన దేశభక్తిని మాటల్లోనే కాదు పచ్చబొట్ల రూపంలో కూడా ప్రదర్శిస్తాడు అభిషేక్.
శరీరంపై స్వాతంత్ర్యసమరయోధుల ఫోటోలు, జవాన్ల పేర్లు
అభిషేక్కు దేశం మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే ఏకంగా ఆయన శరీరంపై దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి ఫోటోలను వారి పేర్లను మొత్తం 593 పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. ఇందులో 560 మందివి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లు,స్వాతంత్ర్య సమరయోధులవి కావడం విశేషం. సాధారణంగా ఈ రోజుల్లో ప్రజలు దేశాన్ని మరిచి తమకు ఇష్టమైన వారి పేర్లు లేదా ప్రేమికులైతే వారి పార్ట్నర్ పేర్లు టాటూలుగా వేయించుకుంటుంటారు. కానీ అభిషేక్ మాత్రం దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల పేర్లు టాటూలుగా వేయించుకుంటాడు. ఇదేమని అడిగితే దేశం తర్వాతే తనకు ఏదైనా అంటూ సమాధానం ఇస్తాడు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ కొన్ని సందర్భాల్లో ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లు పేర్లను తన శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకోవడం తను జవాన్లకు అర్పిస్తున్న నివాళి అని అభిషేక్ చెబుతాడు.
దేశభక్తిని ప్రతిరోజు టాటూలు గుర్తుచేస్తాయి
ఇప్పటి వరకు చాలామంది స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను టాటూగా వేయించుకున్నాడు అభిషేక్. ఇందులో జాతిపిత మహాత్మా గాంధీ, భగత్ సింగ్ లాంటి ఫోటోలు అతని శరీరంపై దర్శనమిస్తాయి. అయితే ఇలా టాటూల వేయించుకోవడం వెనక ఏదైనా కథ ఉందా అని అడిగితే ఇలా చెప్పాడు."గతేడాది లేహ్ లడక్ను సందర్శించాను. ఆ సమయంలో నా స్నేహితుడిని భారత సైన్యం కాపాడింది. మా ప్రయాణమంతటిలో జవాన్లు మాకు రక్షణగా ఉన్నారు. ఇక ఆనాడే వీరమరణం పొందిన జవాన్ల కోసం ఘన నివాళి అర్పించాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పాడు. ఇదిలా ఉంటే ఒకేసారి ఇన్ని టాటూలు వేయించుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరించినప్పటికీ దాన్ని లెక్క చేయలేదు అభిషేక్. ఈ రోజుల్లో దేశ ప్రజల్లో దేశభక్తిని కేవలం ఆగష్టు 15, లేదా జనవరి 26వ తేదీన లేదా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ రోజున మాత్రమే చూస్తున్నామని చెప్పాడు. నేను భారత ఆర్మీలో చేరకపోయినప్పటికీ ప్రతిరోజూ దేశభక్తితోనే బతకాలని భావిస్తున్నానని చెప్పాడు. శరీరంపై పొడిపించుకున్న ఈ పచ్చబొట్లే దేశభక్తిని ప్రతిరోజు తనకు గుర్తు చేస్తాయని వెల్లడించాడు.